Homeప్రత్యేకంChiru Lunch Meeting: జగన్ తో చిరు లంచ్ భేటి.. ఎవరికి ‘స్ట్రోక్’ తగలనుంది?

Chiru Lunch Meeting: జగన్ తో చిరు లంచ్ భేటి.. ఎవరికి ‘స్ట్రోక్’ తగలనుంది?

Chiru L0unch Meeting With CM Jagan: ఏపీలో సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఇండస్ట్రీ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా సమయంలో టికెట్ల రేట్లను తగ్గించడం వల్ల ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీని ఈ నిర్ణయం మరింత ఇబ్బందుల్లోకి తీసుకెళుతుందని ఇండస్ట్రీ తరుపున పలువురు వాదనలు విన్పిస్తున్నారు.

ప్రభుత్వం మాత్రం పేదవాడికి వినోదం అందుబాటులో ఉంచేందుకే టికెట్ల రేట్లను తగ్గించినట్లు చెబుతూ తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంటోంది. ఎవరికీ వారు తగ్గెదేలా అన్నట్లుగా వ్యవహరిస్తుంటంతో ఇదికాస్తా వివాదానికి కారణమవుతోంది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సినిమా వాళ్లను రెచ్చగొట్టేలా మాట్లాడుతుండటంతో అటు నుంచి కూడా ప్రతిస్పందన వస్తోంది. దీంతో ఈ ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

వైసీపీ ఎమ్మెల్యే నల్లపునేని ప్రసన్నకుమార్ రెడ్డి ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ సినిమా వాళ్లు బలిసి కొట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లకు చంద్రబాబు నాయుడి సపోర్టు ఉందని ఆరోపించారు. దీనిపై ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి 2009లో పార్టీ పెట్టకుంటే నాడు టీడీపీ అధికారంలోకి వచ్చేదని కామెంట్ చేశారు. ఆయన పార్టీ పెట్టక ముందు,ఆ తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారని సానుకూల వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో బెదిరింపు పనికి రావని, పరిస్థితుల బట్టి వ్యూహాలు మారుతుంటాయని చెప్పుకొచ్చారు. సినిమా వాళ్లు ఎప్పుడు తనకు పూర్తిగా మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి తమ్మారెడ్డి భరద్వాజ్ సైతం మీడియా ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. రాజకీయ నాయకుల అవినీతిపై చర్చకు వస్తారా? అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఈక్రమంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని లంచ్ కు ఆహ్వానించారు. వీరిద్దరి భేటిలో ప్రధానంగా సినిమా టికెట్ల రేట్లపై చర్చ జరిగే అవకాశం కన్పిస్తోంది.

చిరంజీవి తనకు స్నేహితుడేనని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన రెండ్రోజులకే సీఎం జగన్ చిరంజీవిని లంచ్ కు ఆహ్వానించడం ఆసక్తిని రేపుతోంది. ఈ భేటితో చిరంజీవితో తనదే అసలు సిసిలైన ఆత్మీయబంధం అనే సంకేతాలను సీఎం జగన్ ప్రజలకు పంపించనున్నారు. అలాగే చంద్రబాబు రాజకీయ వ్యూహానికి కూడా ఒకేసారి చెక్ పెట్టనున్నారు.

ఇదే సమయంలో చిరంజీవి సైతం తానే ఇండస్ట్రీ పెద్దగా సమస్య పరిష్కారానికి చొరవ చూపి తన వ్యతిరేక వర్గానికి స్ట్రోక్ ఇవ్వబోతున్నారనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. ఈ భేటి తర్వాత అసలు విషయాలు బయటికి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరీ నేటితో టికెట్ల రేట్ల ఇష్యూకు ఎండ్ కార్డు పడుతుందో లేదో వేచిచూడాల్సిందే..!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version