Chandrababu- Pawan Kalyan
Chandrababu- Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో కలిసి నడవాలని టిడిపి, జనసేన లు భావిస్తున్నాయి.కానీ పొత్తుల గురించి అధికారికంగా ఎక్కడా చెప్పడం లేదు. ఎవరికి వారు పార్టీ బలాలను పెంచుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. వైసీపీ విముక్త ఏపి యే ధ్యేయం అంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు, పవన్ విభిన్న ప్రకటనలు చేస్తున్నారు. సొంత పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేస్తున్నారు. అధికార వైసీపీని గందరగోళంలోకి నెడుతున్నారు.
ప్రజలు తలచుకుంటే తాను సీఎం అవుతానని చెబుతూ వచ్చిన పవన్.. సీఎం అయ్యేందుకు అవసరమైన సీనియార్టీని తాను పెంచుకున్నట్లు తాజాగా ప్రకటించారు. సీఎం పదవి చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అదే సమయంలో చంద్రబాబు సైతం కొత్త ప్రకటన చేశారు. తనకు సీఎం పదవి కొత్త కాదని.. తనకు ఆ పదవి కంటే ఏపీ ప్రజల భవిష్యత్ ముఖ్యమని తాజాగా కామెంట్స్ చేశారు. సరిగ్గా పవన్ తాను సీఎం పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిన సమయంలోనే… చంద్రబాబు తాజా కామెంట్స్ చేయడం విశేషం. మొన్నటి వరకు తనకు ఇవే చివరి ఎన్నికలని.. తనకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు కోరుతూ వచ్చారు. కానీ ఇప్పుడు తనకు సీఎం పదవి పై ఆశ లేదని చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.
అయితే ఈ ఇద్దరు నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అన్న చర్చ అయితే జరుగుతోంది. చంద్రబాబును గెలిపించేందుకు పవన్ తహతహలాడుతున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. పవన్ ను అభిమానించే వారు సైతం ఇటువంటి విమర్శలు తట్టుకోలేకపోతున్నారు. వాటిని తగ్గించేందుకే ఇద్దరు నేతలు ఈ వ్యూహాత్మక ప్రకటన చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. పొత్తులతో ఒకటి కావాలనుకుంటున్న టిడిపి,జనసేన పార్టీ శ్రేణుల ఓటు షేరింగ్ కావాలంటే ఈ తరహా ప్రకటన చేయాల్సి వచ్చిందని అనుమానిస్తున్నారు. మొత్తానికైతే అధికార వైసీపీకి మాత్రం ఇద్దరు నేతలు గందరగోళంలో పడేస్తున్నారు.