చంద్రబాబు అధికారంలో ఉండగా.. అమరావతి కేంద్రంగా రాజధానిని ప్రకటించారు. జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. దీంతో అప్పటి నుంచి అమరావతి వేదికగా ఉద్యమం నడుస్తోంది. ఆ ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తయింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు ఏడాదిగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాయపూడిలో జనభేరి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది అమరావతి జేఏసీ. ఈ సభ వేదికగా రైతులు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ నేతలు కూడా ఈ వేదికను పంచుకోబోతున్నారు.
Also Read: బీ రెడీ.. మోహరిస్తున్న జగన్..
సరిగ్గా ఇదే రోజున ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించారు. జగన్ నిర్ణయంపై రాజధాని రైతులు భగ్గుమన్నారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్లో సీఎం నిర్ణయం అగ్గిరాజేసింది. తమ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనతో రాజధాని రైతులు నిరసనలకు దిగారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం, రాయపూడి తదితర చోట్ల పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టారు. రోడ్లపై బైఠాయించారు. రాస్తారోకోలు చేశారు. నాయకుల ఘెరావ్ చేస్తూ ఉద్యమాన్ని హోరెత్తించారు. అంతేకాదు.. ఏకంగా అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. రైతులు చేపట్టిన సెక్రటేరియట్, అసెంబ్లీ ముట్టడి నాడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన విషయం కూడా తెలిసిందే. పోలీసుల లాఠీచార్జీలో చాలామంది రైతులకు గాయాలయ్యాయి.
అమరావతి వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం.. గుంటూరు, విజయవాడకు కూడా పాకింది. జీఎన్రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదికల సందర్భంగా రాజధాని ప్రాంతంలో రైతులు రోడ్లపై నిరసనలకు దిగారు. రైతుల ఆందోళనలకు ప్రధానప్రతిపక్షం టీడీపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ సంఘీభావం తెలిపాయి. ఏడాది కిందట మొదలైన ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజూ పలు చోట్ల ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు.
Also Read: జమిలీ ఎన్నికలతో కేసీఆర్ చంద్రబాబులు ఔటేనా?
రైతు ఉద్యమానికి ఏడాది నిండడంతో రాయపూడిలో జనభేరి పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు రాజధాని కోసం భూములిచ్చిన రైతులంతా హాజరుకానున్నారు. దాదాపు 30 వేల మందికిపైగా ఈ సభలో పాల్గొంటారని అమరావతి జేఏసీ నేతలు తెలిపారు. ఈ సభా వేదికగా భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేయాలని జేఏసీ భావిస్తోంది. ఈ సభకు టీడీపీ, బీజేపీ ఇరుపార్టీల నాయకులు హాజరవుతున్నారు. రెండు పార్టీల నేతలు ఈ సభలో పాల్గొని రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించనున్నారు. అయితే.. సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ, బీజేపీ నేతలు ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. ఈ సందర్భంగా రెండు పార్టీలు ఎలా వ్యవహరించబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More