100 years sand filled temple: ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా వంద సంవత్సరాల పాటు ఆ గుడిని మూసేశారు. కనీసం అటువైపు ఎవరిని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ గుడిని భారత పురావస్తు శాఖ తెరవడానికి సిద్ధమవుతోంది.
వంద సంవత్సరాల పాటు మూసివేసిన ఆ గుడిని ఇప్పుడు ఎందుకు తెరుస్తున్నారు.. ఇన్ని సంవత్సరాలపాటు ఎందుకు మూసివేశారు.. అందులో ఏమైనా రహస్యం ఉందా.. అనంత పద్మనాభ స్వామి ఆలయం మాదిరిగా నేల మాలిగలు ఏమైనా ఉన్నాయా? ఆతీంద్రియ శక్తులు ఏమైనా నిక్షిప్తమై ఉన్నాయా.. ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.
మనదేశంలో పురాతన ఆలయాలు చాలానే ఉన్నాయి. జాబితాలో ముందు వరుసలో ఉంటుంది కోణార్క్ సూర్య దేవాలయం. ఇక్కడ సూర్యుడికి నిత్యం విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. కోణార్క్ సూర్య దేవాలయం 13వ శతాబ్దానికి చెందినది. ఈ అద్భుతమైన కట్టడం 1900 కాలం నాటికి పూర్తిగా బలహీనమైపోయింది. ఆలయం పైకప్పు నుంచి రాళ్లు ఊడి పడిపోయాయి. గోడలకు పగుళ్లు వచ్చాయి. దీంతో నాటి బ్రిటిష్ అధికారులు 1903 కాలంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆలయం కూలిపోకుండా ఉండడానికి లోపల భాగంలో ఇసుకతో నింపేశారు. ఆలయం ద్వారాలు మొత్తం మూసివేశారు.
సూర్య దేవాలయంలో నింపిన ఇసుక ఇప్పుడు 17 అడుగుల కిందికి కుంగి పోయిందని తెలుస్తోంది. ఫలితంగా ఆలయం పై భాగంలో ఖాళీ ఏర్పడిందని నిపుణులు ఇటీవల గుర్తించారు. ఆలయంలోపల ఇసుకను పూర్తిగా తొలగించి.. శాశ్వతమైన స్టీల్ సపోర్ట్ ఇవ్వాలని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఇప్పుడు పశ్చిమ ద్వారం ద్వారా ఇసుకను బయటికితీస్తున్నారు..
కోణార్క్ సూర్య దేవాలయంలోని గర్భగుడిలో అద్భుతమైన శిల్పకళ ఉంది. విలువైన శిల్ప సంపద ఉంది. ముఖ్యంగా గర్భగుడి మధ్యలో 10 అడుగుల ఎత్తు ఉన్న నల్లటి క్లోరైడ్ రాయితో చేసిన సూర్యుడి విగ్రహం ఉంది. కలింగ శిల్పకలకు సంబంధించిన అరుదైన రాతి స్తంభాలు ఇందులో ఉన్నాయి. 7 స్వరాలను పలికించే సంగీత స్తంభాలు కూడా ఇక్కడ ఉన్నాయి.
గర్భగుడిలో ఉన్న ఇసుకను జాగ్రత్తగా తొలగిస్తారు. ఎటువంటి ప్రకంపనలు లేకుండా ఇసుకను నెమ్మదిగా బయటకి తీస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుంది. లోపల మొత్తం బలమైన సపోర్ట్ ఏర్పాటు చేసిన తర్వాత పర్యాటకులను సందర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. అయితే ఇందులో నిధుల అన్వేషణ లేదని.. కేవలం పురావస్తు కట్టడాలను కాపాడుకోవాలని తాపత్రయం మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నారు.