Bonalu: సింగపూర్‌లో వైభవంగా బోనాల జాతర… ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు ప్రజలు..!

బోనాల వేడుకలు ఆద్యంతం కోలాహలంగా సాగాయి. ఈ జాతరలో తెలుగువారంతా కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కార్మిక సోదరులు చురుగ్గా పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులంతా జానపద సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేశారు. అనంతం అమ్మవారి తీర్థప్రసాదాలను పంచారు. ఒగ్గు కళాకారుడు నక్కా సురేశ్‌ చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Written By: Raj Shekar, Updated On : July 17, 2024 6:04 pm

Bonalu

Follow us on

Bonalu: సింగరూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఆదివారం(జూలై 14న) తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. శ్రీశివన్‌ ఆలయంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో 800 మంది ప్రత్యక్షంగా పాల్గొనగా.. ఆన్‌లైన్‌ వేదికగా సుమారు 7 వేల మంది వీక్షించారు.

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా..
ఇక సింగపూర్‌లో నిర్వహించిన బోనాల జాతరలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఒగ్గు డోలు కళాకారుల నృత్యం, పోతురాజుల ప్రదర్శన, భక్తిగీతాలు, జానపద కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు బోనాలు తయారు చేసి నెత్తిన పెట్టుకుని ఊరేగింపు నిర్వహించారు. ఏటా నిర్వహించుకునే వేడుకలకు బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితాదేవి, తుల దీపారెడ్డి, మోతె సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో బోనాలు తయారు చేశారు. తర్వాత సంప్రదాయ, సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలిపాయి.

కోలాహలంగా..
ఇక వేడుకలు ఆద్యంతం కోలాహలంగా సాగాయి. ఈ జాతరలో తెలుగువారంతా కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కార్మిక సోదరులు చురుగ్గా పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులంతా జానపద సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేశారు. అనంతం అమ్మవారి తీర్థప్రసాదాలను పంచారు. ఒగ్గు కళాకారుడు నక్కా సురేశ్‌ చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకుతో నరేశ్‌ 10 నిమిషాలపాటు పాటలు పాడుతూ డబ్పును వాయిస్తూ అమ్మవారికి బోనం తీసుకువస్తూ చేసిన నృత్యం ఆకట్టుకుంది.

పెద్దపులి ఆట.. పోతురాజు వేషధారణ..
ఇక ఈ వేడుకల్లో పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, వారి ఆహార్యం, మనోహరమైన జానపద నృత్య ప్రదర్శన ఈ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చాయి. ఎంతో మంది తెలుగు వారు తమ పిల్లలకి ఈ సందర్భంగా తెలంగాణ సంప్రదాయాన్ని తెలియజేశారు. బోనాల పండుగ విశిష్టతను వివరించారు. సింగపూర్‌ తెలుగు సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి బోనాల పండుగ ప్రాముఖ్యతను వివరించారు. బోనాల పండుగ తెలుగు వారికి, ముఖ్యంగా తెలంగాణ జాన సద సంస్కృతితో ముడిపడి ఉందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమ నిర్వాహకులు బోయిని సమ్మయ్య తెలిపారు. సింగపూర్‌లో తెలుగువారి ఐక్యత, సాంస్కృతిక గొప్పతనం అందరికీ ఈ కార్యక్రమంతో చాటి చెప్పినట్లు తెలిపారు. జాతరకు సహకరించిన అందరికీ పేరుపేరున గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్‌ కృతజ్ఞతలు తెలిపారు.