Alekhya Reddy Political Entry: నందమూరి తారకరత్న( Nandamuri Taarak Ratna ) భార్య అలేఖ్య రెడ్డి పొలిటికల్ ఎంట్రీ పై అప్పుడే అనేక రకాల చర్చలు ప్రారంభం అయ్యాయి. ఏమో రాజకీయాల్లోకి రావచ్చు అన్న మాటలతో నందమూరి అభిమానులతో పాటు టిడిపి మద్దతుదారులలో ఒక ఆసక్తిని రేకెత్తించింది. రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు అలేఖ్య రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఆమె వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి సమీప బంధువు. దీంతో ఆమె పొలిటికల్ ఎంట్రీ పై భిన్న కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు అలేఖ్య రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒకరకమైన గందరగోళానికి దారితీస్తున్నాయి. తారకరత్న మృతి చెంది మూడేళ్లు అవుతోంది. అయితే ఆమెకు అత్తింటి వారి నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లేదని ఆమె మాటల్లోనే అర్థమవుతోంది. అదే సమయంలో చంద్రబాబు, బాలకృష్ణ విషయంలో ఆమె సాఫ్ట్ గానే ఉన్నట్లు కనిపిస్తున్నారు.
Also Read: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు..అందరూ గురువిందలే
* మూడేళ్ల కిందట తారకరత్న మృతి
లోకేష్ ( Nara Lokesh ) పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. కానీ ఆయన భార్య అలేఖ్య రెడ్డి మాత్రం ఒంటరిగానే ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా కొన్ని ఇంటర్వ్యూలో రాజకీయపరమైన ప్రకటనలు చేశారు. ఆమె నందమూరి వారి కోడలు కావడంతో పొలిటికల్ ఎంట్రీ అనగానే టిడిపిలో అడుగుపెడతారని భావిస్తారు. కానీ అలేఖ్య రెడ్డి మాత్రం తాను రాజకీయాల్లోకి వస్తాను కానీ.. అందుకు ఏ పార్టీ సరైనది అని నిర్ధారించుకోలేదని చెప్పారు.
* నందమూరి ఫ్యామిలీ పై అసంతృప్తి..
అలేఖ్య రెడ్డి( Alekhya Reddy ) మాటలు చూస్తే మాత్రం ఆమె నందమూరి కుటుంబం పై అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అలేఖ్య రెడ్డిని పెద్దలకు ఇష్టం లేకున్నా ప్రేమ వివాహం చేసుకున్నారు తారకరత్న. కుటుంబ సభ్యుల సంపూర్ణ అంగీకారం లేకుండానే వారి వివాహం జరిగినట్లు ఆమె మాటల్లోనే అర్థమవుతోంది. అయితే ఇటువంటి అసంతృప్తితో ఉన్న క్రమంలో ఆమె పొలిటికల్ ఎంట్రీ ప్రకటన చేయడం మాత్రం ఆసక్తి రేపుతోంది. పైగా విజయసాయిరెడ్డి సమీప బంధువు కావడం.. ఆయన ఆ కుటుంబానికి అండగా నిలుస్తుండడం చూస్తుంటే మాత్రం ఆయనతో కలిసి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ అవకాశాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తమకు అనుకూలంగా మార్చుకోగలదు. ఎందుకంటే ఇప్పటికే లక్ష్మీపార్వతిని ఇలానే టిడిపి నాయకత్వం పై ప్రయోగిస్తోంది.
* వైసీపీకి భలే ఛాన్స్..
ఇప్పటికే లక్ష్మీపార్వతి( Lakshmi Parvathi ) చంద్రబాబు తో పాటు నందమూరి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేయాలంటే నందమూరి కుటుంబం పై సాఫ్ట్ కార్నర్ తో మాట్లాడుతుంటారు. అలాగే నందమూరి కుటుంబ సభ్యులకు కూడా విమర్శలు చేస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో లక్ష్మీపార్వతి కన్నీరు కారుస్తుంటారు. అందుకే ఇప్పుడు అలేఖ్య రెడ్డిని పార్టీలోకి తీసుకొని.. టిడిపి నాయకత్వంతో పాటు నందమూరి కుటుంబాన్ని టార్గెట్ చేయవచ్చు. ఇటువంటి రాజకీయాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది అందివేసిన చేయి. అందుకే అలేఖ్య రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ప్రకటన ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది. ఆమె ప్రయాణం ఎలా ఉండబోతుంది? ఆమె ఎవరు వదిలిన బాణం అన్నది తెలియాల్సి ఉంది.