HomeNewsVizag Steel Plant: వచ్చే ఎన్నికల్లో ‘విశాఖ’ ఉక్కే ఏపీ ఎజెండా?

Vizag Steel Plant: వచ్చే ఎన్నికల్లో ‘విశాఖ’ ఉక్కే ఏపీ ఎజెండా?

Vizag Steel Plant
Vizag Steel Plant

Vizag Steel Plant: ఏం జరిగింది ఏమో కానీ.. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అయితే అది భయమా? వ్యూహమా? అన్నది తెలియడం లేదు. జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు అడుగుపెడుతున్న వేళ, మరోవైపు స్టీల్ ప్లాంట్ ఇష్యూతో బీఆర్ఎస్ ను విస్తరించాలనుకుంటున్న కేసీఆర్ చర్యలతోనే విశాఖ స్టీల్స్ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ప్రైవేటీకరణ లాంటి నిర్ణయం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి స్పష్టం చేయడంతో బీఆర్ఎస్ నోట్ల పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్నారంటూ హడావుడి చేస్తున్న బీఆర్ఎస్‌కు షాకిచ్చేలా కేంద్రం ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలో ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి ప్రకటన ఇచ్చారు. ఇప్పటికిప్పుడుప్రైవేటు సంస్థలకు అమ్మే ప్రక్రియ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్‌ను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

వెనక్కి తగ్గడానికి కారణాలేంటి?
గత రెండేళ్లుగా విశాఖ స్టీల్ ఉద్యమం నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం దాదాపు ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుందని వార్తలు వచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేయ్యడమే తప్ప ప్రత్యామ్నాయమంటూ ఏదీ లేదని మంత్రులు, కేంద్ర పెద్దలు చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. దీంతో స్టీల్ విక్రయం తప్పదని అంతా భావించారు. కానీ సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పతాక స్థాయిలో ఉద్యమం రగిలినా ఏనాడు ప్లాంట్ వైపు కేంద్ర మంత్రులు ముఖం చూపలేదు. అటువంటిది పని గట్టకొని కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ప్లాంట్ ను సందర్శంచారు. బీఆర్ఎస్ చేస్తున్న హడావుడి నేపథ్యంలో కీలక ప్రకటనలు చేశారు. కొన్ని అంశాలపై స్పష్టతనిచ్చారు.

బీఆర్ఎస్ కు చెక్…
గత వారం రోజులుగా స్టీల్ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ముడిసరుకు, మూల నిధి సమకూర్చి.. దాని మేరకు ఉత్పత్తులు పొందేందుకు బిడ్ వేసేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. సరిగ్గా ఇటువంటి సమయంలో కేంద్ర మంత్రి వారి ఆశలపై నీళ్లు చల్లారు. ప్రస్తుతానికి ముడి సరకు పెంపొందించే ప్రక్రియపై ఫోకస్ చేసినట్లుగా చెప్పారు. ఈ అంశంపై రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అధికారులతో సమావేశం అవుతున్నామని, మరిన్ని విషయాలు చర్చిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేయడానికి ప్రయత్నిస్తుండడం ఒక బూటకం మాత్రమేనని కొట్టిపారేశారు. బిడ్డింగ్‌లో పాల్గొనడం వారి పరిధిలోని విషయం అని స్పష్టం చేశారు. ఇటీవల స్టీల్ ప్లాంట్ కు అవసరమన ముడిపదార్థల సరఫరా కోసం ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెన్ట్ జారీ చేశారు. అందులో బిడ్డింగ్ వేస్తే.. స్టీల్ ప్లాంట్ చేతికి వచ్చినట్లేనని బీఆర్ఎస్ హడావుడి చేసింది. సింగరేణి అధికారుల్ని స్టీల్ ప్లాంట్ కు పంపి వివరాలు తెలుసుకుంది.

Vizag Steel Plant
Vizag Steel Plant

బిడ్ సాధ్యమేనా?
స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న రాజకీయాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. వీలైనంత త్వరగా దీనిపై స్పష్టతనివ్వాలని భావించింది. మరీ ముఖ్యంగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయ ఎత్తుగడను తెరదించాలని డిసైడ్ అయ్యింది. అందుకే నేరుగా కేంద్ర మంత్రిని ప్లాంట్ కు పంపించి కొన్ని అంశాలపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు బిడ్డింగ్ వేస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఒక వేళ బిడ్డింగ్ దాఖలు చేసి.. ఆ చాన్స్ వచ్చినా అది తెలంగాణ సర్కార్ కు రూ. ఐదు వేల కోట్ల వరకూ ఆర్థిక భారం అవుతుంది కానీ ఒక్క శాతం కూడా యాజమాన్య హక్కులు వచ్చే అవకాశం ఉండదు. అందుకే కేసీఆర్ అంతటి సాహసానికి దిగరని కేంద్రం భావిస్తోంది.ఓవరాల్ గా చూస్తే బీజేపీపై పైచేయి సాధించి ఏపీలో బలపడాలని కేసీఆర్ స్కెచ్ గీశారు. ముందే సర్దుకున్న బీజేపీ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గింది. తగ్గేలా కేసీఆర్ పరిస్థితులు కల్పించారు. సో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ పోటీచేయడానికి సీట్లు గెలవడానికి ఇంతకుమించిన సదావకాశం ఉండదు. విశాఖ స్టీల్ ను బేస్ చేసుకొని ఏపీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న కేసీఆర్ కు ఆ మేరకు రాజకీయ లబ్ధి చేకూరుతుందా? లేదా? అన్నది చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version