TDP Former MP: కొంతమంది నేతల తీరు అందితే జుట్టు.. లేకుంటే కాళ్లు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని పరిస్థితి కూడా అంతే. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. టిడిపి నుంచి తనను బయటకు పంపించడంలో సోదరుడు చిన్ని తీరుపై పూర్తి అసహనంతో ఉన్న నాని.. ఆయన చేతిలోనే ఓడిపోయారు. దీంతో పూర్తిగా మనస్థాపానికి గురయ్యారు. రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో అస్సలు సంబంధం లేదని తేల్చేశారు. అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లానన్న బాధ ఆయనలో కనిపించింది. అయితే తనకు దక్కాల్సిన గౌరవం తమ్ముడు చిన్నికి దక్కుతుండడంతో తట్టుకోలేకపోతున్నారు నాని.
తమ్ముడిని టార్గెట్ చేసుకొని..
పూర్తిగా రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కేసినేని నాని.. తరువాత క్రమంలో మళ్లీ రాజకీయాలు మొదలుపెట్టారు. తనను టిడిపి నుంచి బయట పెట్టేసిన తమ్ముడు చిన్ని పై ఓ రేంజ్ లో రాజకీయం ప్రారంభించారు. ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబుకు లేఖలు రాస్తూ.. తన బాధ, ఆవేదన తన తమ్ముడి చిన్ని పై తప్ప చంద్రబాబుపై కానీ.. టిడిపి పై కానీ తనకు ఎటువంటి దురుద్దేశం లేదని సంకేతాలు పంపారు. తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే చేరేందుకు సిద్ధమని కూడా తన ప్రవర్తన ద్వారా తెలియజేశారు. విజయవాడలో రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. అయితే అదంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లైన్లోనే అని తాజాగా తెలిసిపోయింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు సాయి కృష్ణ అదృశ్యం మిస్టరీకి సంబంధించి విజయవాడ కమిషనర్ ను సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేసేదాకా పరిస్థితి వచ్చింది. తద్వారా వైసిపి ముసుగు తీసి కేసినేని నాని మరోసారి రాజకీయం చేసినట్టే కనిపించారు.
ఇప్పుడు మళ్లీ వైసిపి ముసుగుతోనే..
రెండుసార్లు విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి గెలిచారు కేసినేని నాని. ప్రజారాజ్యం ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2009లో ఎంపీగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. తరువాత చంద్రబాబు పిలిచి 2014 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు సీటు ఇచ్చారు. అక్కడ తిరుగులేని విజయం సాధించిన నాని 2019లో జగన్ ప్రభంజనంలో సైతం గెలిచారు. రెండోసారి గెలిచిన తర్వాత అదంతా తన వ్యక్తిగత చరిష్మ అని భావించారు. అలా క్రమేపీ పార్టీకి దూరమయ్యారు. లోకేష్ ను అడ్డం పెట్టుకొని తన తమ్ముడి చిన్ని హైకమాండ్కు దగ్గరయ్యారన్న బాధ నాని లో ఉండేది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీలో చేరి తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఫలితాలు వచ్చాక వైసీపీతో తెగతెంపులు చేసుకున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు అదే వైసీపీ లైన్ లో రాజకీయాలు చేస్తుండడంతో ఆయన ముసుగు తీసినట్టు అయింది.
