Maa memebrs Got Voice Message From Mohan Babu: గతంలో ఎన్నడూ లేని విధంగా ‘మా’ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకవైపు నుండి జూనియర్ ఆర్టిస్టుల సంఘం ఎన్నికలు నిర్వహించవద్దని, వారి సమస్యలు తేల్చాకే ఎన్నికలు నిర్వహించాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఇది ఇలా ఉండగా ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ గెలుపు కోసం ఇప్పటికే సినీ ప్రముఖులను కలిసి ఓట్లు అడిగిన విష్ణుబాబు, తన తండ్రిని కూడా రంగంలోకి దింపాడు. దీంతో ఈ ఎన్నికలు మరింత ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఇరువర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకోగా.. పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ గెలుపు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
ఆదివారం ఉదయం జరగబోయే ఎన్నికల్లో విష్ణుకే ఓటు వేయాలని ‘మా’ సభ్యులకు ఈరోజు మోహన్ బాబు వాయిస్ మెస్సేజ్ పంపారు. దాని సారాంశం ‘తెలుగు వాళ్లు ఒకటిగా ఉండాలనే ‘మా’ ఏర్పాటు చేశారని ప్రస్తుతం ‘మా’ ఎన్నికల పరిస్థితి చూస్తే మనసుకు కష్టంగా ఉందన్నారు. గతంలో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని పెద్దలు అనేవారని, అయితే, కొంతమంది సభ్యులు రోడ్డునపడి నవ్వులపాలవుతున్నారన్నారు డైలాగ్ కింగ్.
అంతే కాదు, ఎవరు ఏం చేసినా ‘మా’ అనేది ఒకే కుటుంబం అని, విష్ణు బాబు గెలిచాక రెండు రాష్ట్రాల సీఎంలను కలుస్తామని, మన సినీ పరిశ్రమ కష్టాలను వారికి చెప్పుకుందామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విష్ణు తప్పకుండ నెరవేరుస్తాడనే నమ్మకం తనకి ఉంది. విష్ణు మీ కుటుంబ సభ్యుడు. ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటు వేయండి’ అంటూ వాయిస్ మెస్సేజ్లో సభ్యులను కోరారు.