AP land allotment: ప్రభుత్వ భూములకు సంబంధించి కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాజెక్టులకు గాను కేటాయించే భూములను విక్రయించేందుకు, రిజిస్ట్రేషన్లు జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇకనుంచి ఆ భూమిపై పూర్తి హక్కులు సంబంధిత యాజమాన్యాల కేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మంగళవారం జీవో జారీ చేశారు. మార్కెట్ ధరకు తీసుకున్న భూములను తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని.. తమకు పూర్తి హక్కులు కల్పించాలని కంపెనీలు సుదీర్ఘకాలంగా కోరుతూ వస్తున్నాయి. ఎట్టకేలకు దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పర్యాటక ప్రాజెక్టుల విషయంలో.. టూరిజం కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం భూములు కేటాయిస్తోంది. ప్రాజెక్టు డెవలపర్గా తమకు ఇస్తున్న భూములపై పూర్తిగా హక్కులు ఉండాలని కంపెనీలు పట్టుబడుతున్నాయి. దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఏపీటీడీసీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఈ మేరకు సానుకూల నిర్ణయం తీసుకోవడం విశేషం.
భూముల కేటాయింపు అలా..
ఏ ప్రభుత్వంలోనైనా పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఈ లెక్క తోనే ప్రభుత్వాలు భారీ ఎత్తున సాధారణ ధరకు ప్రైవేటు కంపెనీలకు భూములను కేటాయిస్తాయి. అయితే చౌకగా భూములు తీసుకున్న వారిలో కొందరు వాటిని బ్యాంకులో తనకా పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడం లేదు. అయితే భూయాజమాన్య హక్కులు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నప్పుడే ఆ పరిస్థితి ఉంటే.. ఇప్పుడు అదే కంపెనీలకు సేల్ చేసి.. హక్కులు బదలాయిస్తే ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి.
ఆ చట్టానికి సవరణ..
ఇప్పటిదాకా ప్రభుత్వ భూముల కేటాయింపులు ఒక ప్రక్రియ కొనసాగేది. ఆయా కంపెనీల స్వభావం, పెట్టి పెట్టుబడి, ఉపాధి కల్పన స్థాయిని బట్టి ఉచితంగా, రాయితీ ధరకు, కనీస విలువ ఆధారంగా మార్కెట్ విలువకు భూములు కేటాయిస్తూ వస్తున్నారు. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో విడుదలైన భూ కేటాయింపు పాలసీ ప్రకారం కేటాయింపులు జరుగుతూ వస్తున్నాయి. కంపెనీలకు మార్కెట్ ధర ప్రకారం భూములు కేటాయించినా.. ఉచితంగా అందించినా.. యాజమాన్య హక్కులు మాత్రం ప్రభుత్వం వద్దనే ఉంటున్నాయి. వాటిని నిషేధిత జాబితా 22 (a) లో ఉంచేవారు. అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన భూములను ఇతరులకు విక్రయించుకునే అవకాశం ఉండదు. ఒకవేళ కంపెనీలు ఆ భూములను తనకా పెట్టి రుణాలు తీసుకోవాలన్న ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే ఇప్పుడు పర్యాటక ప్రాజెక్టులు శరవేగంగా అభివృద్ధి చెందాలంటే ఈ నిబంధనను సడలించి ప్రభుత్వం వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనిపై వ్యతిరేక ప్రచారం మొదలైంది. మరి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా? అలానే ముందుకు వెళుతుందా అన్నది చూడాలి.
