Teacher Day: పురాణాల నుంచి నేటి వరకు భారతదేశంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. బడిని గుడిలా, ఉపాధ్యాయులను దేవుడిలా పూజిస్తారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో వారి పాత్ర ఎనలేనిది. పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా జీవితంలో ఎదురయ్యే పరీక్షలను ఎదుర్కొనేలా సిద్ధం చేస్తారు. మన బలాలు, బలహీనతలను కనుగొనడంలో సహాయం చేస్తారు. అందుకే గురువుల సేవలను గౌరవించుకునేలా ఏటా సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురువులను పూజిస్తున్నారు. ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తి రగిలించిన కొందరు భారత దేశ గురువుల గురించి తెలుసుకుందాం.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో టీచింగ్ కెరీర్ ప్రారంభించారు. ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఇండియన్ ఫిలాసఫీ, ది రీన్ ఆఫ్ రిలీజియన్ ఇన్ కాంటెంపరరీ ఫిలాసఫీ వంటి పుస్తకాలు రాశారు. కాంగ్రెస్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్, ది ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఫిలాసఫీ(హార్వర్డ్ వర్సిటీ) వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశాలలో రాధాకృష్ణన్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
స్వామి వివేకానంద
స్వామి వివేకానంద బోధనలు విద్య వ్యక్తులలోని స్వాభావిక పరిపూర్ణతను వ్యక్తపరచాలని నొక్కిచెప్పాయి. ఆయన రామకృష్ణ మిషన్కు నాయకత్వం వహించారు. సన్యాసులు, సాధారణ పౌరులను దాతృత్వంలో నిమగ్నమయ్యేలా ప్రేరేపించారు. మొదటి మంచి మానవులుగా ఉండాలని, జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని, చివరికి వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని వివేకానంద చెప్పేవారు.
సావిత్రిబాయి ఫూలే
సావిత్రీబాయి ఫూలే, ఆమె భర్త జ్యోతిరావు ఫూలేతో కలిసి, భారతదేశంలోని బాలికలు, అట్టడుగు వర్గాలకు విద్యను అందించడానికి పోరాడారు. 1848లో వారు భారతదేశపు మొదటి బాలికల పాఠశాలను స్థాపించారు. సావిత్రీబాయి దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యారు. ఆమె ఉపాధ్యాయురాలిగా మాత్రమే కాకుండా మహిళల హక్కుల కోసం కూడా పోరాడారు.
రవీంద్రనాథ్ ఠాగూర్
రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రధానంగా కవిగా గుర్తింపు పొందినా.. విద్యకు ఆయన చేసిన కృషి కూడా అంతే స్థాయిలో కీర్తి అందుకుంది. 1901లో ఠాగూర్ శాంతినికేతన్ పాఠశాలను స్థాపించారు, దీనిని ఇప్పుడు విశ్వభారతి పాఠశాలగా పిలుస్తారు. నేచురల్ వరల్డ్లో నేర్చుకోవడానికి చాలా ఉందని నమ్మారు, తరచూ చెట్ల నీడలో తరగతులు నిర్వహించేవారు. విద్యలో వినూత్న పద్ధతులు తీసుకొచ్చారు.. ప్రజలను ప్రకతితో అనుసంధానించడం, సంపూర్ణ అభ్యాస అనుభవాలను పెంపొందించడం లక్ష్యంగా చేసుకున్నారు.
డాక్టర్ అబ్దుల్ కలాం
భారత రాష్ట్రపతిగా తనదైన ప్రత్యేకతను చాటారు డాక్టర్ ఏపీజే. అబ్దుల్ కలాం. ఆయన ఎప్పుడూ తనను తాను గురువుగా భావించేవారు. ఐఐఎం షిల్లాంగ్, అహ్మదాబాద్ వంటి ఇనిస్టిట్యూషన్స్లో గౌరవ అతిథిగా ప్రసంగించారు. 2004లో ఉపాధ్యాయులకు జాతీయ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా డా.కలాం.. క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ పెంపొందించడంలో విద్య పాత్రను నొక్కి చెప్పారు. దేశంలోని సవాళ్లను పరిష్కరించడానికి, బలమైన, స్వతంత్ర భారతదేశానికి దోహదపడేలా యువత మనస్సులను రూపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన విశ్వసించారు.