Ration Card: ఈ రోజే లాస్ట్‌.. అలా చేయకుంటే మీ రేషన్‌ కార్డు కట్‌..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీ చేసిన రేషన్‌ కార్డులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని రేషన్‌ కార్డులు మాత్రమే ఇచ్చారు.

Written By: Raj Shekar, Updated On : February 29, 2024 9:07 am

Ration Card

Follow us on

Ration Card: బోగస్‌ రేషన్‌ కార్డులను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రేషన్‌ కార్డు ఉన్నవారు ఈకేవైసీ చేసుకోవాలని గత ప్రభుత్వమే సూచించింది. ఈ ప్రక్రియ ఐదు నెలలుగా కొనసాగుతోంది. మొదట డిసెంబర్‌ 31 వరకు గడువు పెట్టారు. తర్వాత ఎన్నిల నేపథ్యంలో జనవరి 31 వరకు పొడిగించారు. అయినా 75 శాతమే ఈకేవైసీ చేసుకోవడంలో ఫిబ్రవరి 29 వరకు ఛాన్స్‌ ఇచ్చారు. ఈ రోజే లాస్ట్‌ ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈకేవైసీ లేకుంటే కార్డు కట్‌..
రేషన్‌ డీలర్ల వద్ద ఈకేవైసీ సులభంగా చేసుకోవచ్చు. అయితే ఈ కేవైసీ లేని రేషన్‌ కార్డులు తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. రేషన్‌కార్డును ఆధార్‌ నంబర్‌తో లింక్‌ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌సింగ్‌ చౌహాన్‌ సూచించారు. భారత ప్రభుత్వం అర్హులైన పేదలకే గరీబ్‌ కళ్యాణ్‌ అన్నయోజన స్కీం ద్వారా బియ్యం, ఇతర సరుకులు అందిస్తుందని తెలిపారు.

కార్డులో చనిపోయిన వారి పేరుల..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీ చేసిన రేషన్‌ కార్డులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని రేషన్‌ కార్డులు మాత్రమే ఇచ్చారు. పాత కార్డుల్లో ఉన్నవారు చాలా మంది చనిపోయారు. వారి పేర్లు ఇప్పటికీ కార్డులో కొనసాగుతున్నాయి. ఇలా లక్షల మంది ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. వీరిని తొలగించేందుకే ఈకేవైసీ తప్పనిసరి చేసింది.

గడువు పెంపు లేనట్లే..
ఇప్పటికే పలుమార్లు గడువు పెంచిన ప్రభుత్వం ఇక ఈసారి పెంపు ఉండదని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 29 తర్వాత మార్చి లేదా ఏప్రిల్‌ నుంచి ఈకేవైసీ లేనివారిని రేషన్‌ కార్డు నుంచి తొలగిస్తుందని పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 28 నాటికి 85 శాతం ఈకేవైసీ పూర్తయినట్లు తెలుస్తోంది.

వేలి ముద్ర పడనివారు..
ఇక 15 శాతం మంది వేలి ముద్ర పడని వృద్ధులు ఉన్నారు. వీరు ఎంత ప్రయత్నించినా వేలిముద్ర పడడం లేదు. ఐ కాంటాక్టు ద్వారా తీసుకునేందుకు చాలామంది డీలర్లు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో గడువు ముగిస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపించాలని సూచిస్తున్నారు.