VK Pandian: పాండ్యనే నవీన్ పట్నాయక్ వారసుడు?

పాండియన్ 2000వ సంవత్సరం బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన వయస్సు 49 ఏళ్లు. తొలుతా సబ్ కలెక్టర్ గా, అనంతరం కలెక్టర్గా విధులు నిర్వహించారు.

Written By: Dharma, Updated On : November 28, 2023 10:48 am

VK Pandian

Follow us on

VK Pandian: ఒడిస్సా రాజకీయాల్లో కీలక మలుపు.బీజేడీ భావినాయకత్వంపై ఫుల్ క్లారిటీ వస్తోంది. సీఎం నవీన్ పట్నాయక్ రాజకీయ వారసుడిగా భావిస్తున్న వికె పాండ్యన్ అధికారికంగా బిజె డి లో చేరారు. ఇప్పటికే ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉంటూ విఆర్ఎస్ తీసుకున్న పాండ్యన్ నవీన్ వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు. ఇలా ఉంటూనే నెలరోజుల వ్యవధిలో బిజెపిలో అధికారికంగా చేరడం విశేషం. త్వరలో పాండ్యన్ ను రాజకీయ వారసుడిగా నవీన్ ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇదే జరిగితే ఒడిస్సాలో అధికార బీజేడీకి భావి నాయకత్వ లోటు తీరినట్టే.

పాండియన్ 2000వ సంవత్సరం బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన వయస్సు 49 ఏళ్లు. తొలుతా సబ్ కలెక్టర్ గా, అనంతరం కలెక్టర్గా విధులు నిర్వహించారు. 2011లో నవీన్ పట్నాయక్ చేరువయ్యారు. అప్పటినుంచి ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గత నెల 23న ప్రభుత్వ సేవల నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఆ వెంటనే ఒడిస్సా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 5టీ చైర్మన్ గా నియమితులయ్యారు. పాండ్యన్ సమర్ధుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. నవీన్ పట్నాయక్ నమ్మకమైన, ఇష్టుడైన అధికారిగా మారిపోయారు. ఇప్పుడు ఆయన బిజెపిలోకి ఎంట్రీ ఇవ్వడంతో.. నవీన్ పట్నాయక్ వారసుడిగా ప్రచారం జరుగుతోంది.

నవీన్ పట్నాయక్ వయోభారంతో బాధపడుతున్నారు. పార్టీకి భావి నాయకుడు అవసరం కీలకంగా మారింది. అందుకే సమర్థవంతమైన నేత కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో దశాబ్ద కాలంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న పాండ్యన్ పనితీరు నవీన్ పట్నాయక్ ను ఆకర్షించింది. ఆయన అయితే బిజూ జనతాదళ్ పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఒడిస్సా అభివృద్ధికి కృషి చేస్తారని నవీన్ పట్నాయక్ భావిస్తున్నట్లు సమాచారం. బిజెపిలో నవీన్ పట్నాయక్ నిర్ణయానికి తిరుగులేదు. దీంతో ఆయన పాండ్యన్ ను వారసుడిగా ప్రకటించే అవకాశం ఉంది. దానికి పార్టీ వర్గాలు ఏకగ్రీవంగా ఆమోదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అయితే నవీన్ పట్నాయక్ నిర్ణయాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ పాండ్యన్ బీజేడీలో చేరికను తప్పుపడుతున్నాయి. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఒక బ్యూరోక్రాట్ కు అద్దెకు తెచ్చుకుందని విమర్శలు చేస్తున్నాయి. సీఎం నవీన్ సన్నిహితుడిగా ఉన్న పాండ్యన్.. రాజకీయ ప్రయోజనాల కోసం తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వివాదం కూడా నడిచింది. కాగా పాండ్యన్ బీజేడీలో చేరిన నేపథ్యంలో సీఎం నవీన్ పట్నాయక్ వీడియో సందేశం పంపారు. ” పాండ్యన్ ను బీజేడీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నా.. పార్టీ కోసం.. ఒడిశా ప్రజల కోసం.. పూర్తి అంకిత భావంతో, చిత్తశుద్ధితో పనిచేస్తారని ఆశిస్తున్నా ” అంటూ నవీన్ పట్నాయక్ సందేశం సాగింది. కాగా పార్టీలో చేరిన సందర్భంలో సీఎం నవీన్ పట్నాయక్ కు పాండ్యన్ పాదాభివందనం చేయడం విశేషం.