PM Modi Lakshadweep: కళ్ళు ఉన్నవాడు ముందు చూస్తాడు. దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. ఇప్పుడు ఈ మాట భారత ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే మొన్నటిదాకా మాల్దీవుల విషయంలో జరిగిన రచ్చ.. లక్షద్వీప్ పర్యాటకం విషయంలో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. అయితే చాలామంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేవలం లక్షద్వీప్ లో పర్యాటకాన్ని బలోపేతం చేసేందుకు మాత్రమే దూకుడుగా వెళ్తున్నారని చాలామంది అనుకున్నారు. కానీ దాని వెనుక మోడీ వేసిన స్కెచ్ ను ఎవరూ ఊహించలేకపోయారు.
లక్షద్వీప్ అనేది అనేక దీవుల సముదాయం. అయితే ఇక్కడ నైన్ డిగ్రీ ఛానల్ అనే ఒక సముద్ర మార్గం ఉంటుంది. ఈ సముద్ర మార్గంలో ఏమాత్రం చిన్న అలజడి రేగినా అది ఆసియా ప్రాంతంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేయగలదు. అయితే ఈ సముద్ర మార్గం హిందూ మహాసముద్రంలోని లక్షద్వీప్ లోని కాల్పెనీ, మినికోయ్ దీవులను వేరు చేస్తుంది.. ఇది అత్యంత కీలకం కాబట్టే.. మోదీ దీనిపై ప్రముఖంగా దృష్టి సారించారు. గత ఏడాదికాలంగా ఇక్కడ పర్యాటకాన్ని మరింత బలోపేతం చేసే విధంగా చర్యలను చేపట్టారు. త్వరలో ఇక్కడ ఒక విమానాశ్రయాన్ని కూడా నిర్మించబోతున్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేలకోట్ల విలువైన అభివృద్ధి పనులను ఇక్కడ చేపట్టబోతున్నారు.. ఈ ద్వీపం మీద భారత్ గుత్తాధిపత్యం ఉంటుంది కాబట్టి.. పైగా నైన్ డిగ్రీ ఛానల్ ఇక్కడే కేంద్రీకృతం అయి ఉంది కాబట్టి.. ఆసియాలోని భారతదేశానికి ప్రతిబంధకంగా ఉండే చైనా, ఇతర దేశాలను సవాల్ చేయవచ్చని మోడీ ఆలోచన. ఈ సముద్ర మార్గం అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా అత్యంత కీలకం. నిమిషానికి 11 గోడలు ఈ మార్గం మీదుగా ప్రయాణిస్తాయి అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నైన్ డిగ్రీస్ ఛానల్ ఆఫ్రికా, పశ్చిమాసియా, ఐరోపా నుంచి భారత్, దక్షిణాసియా, చైనా, అగ్నేయాసియాలకు ఈ మార్గం ప్రాణాధారం. ఈ కీలక మార్గం భారత ప్రాదేశిక జలాల నుంచి వెళ్లడం.. భారతదేశానికి సముద్ర మార్గాలపై ఆధిపత్యానికి అవకాశం కలిగిస్తోంది. ఇక్కడ విస్తరించి ఉన్న మిని కోయ్ దీవులను రక్షణ స్థావరం గా ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది. ఒకవేళ గనుక భారత్ దీనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తే సముద్ర జలాలపై తిరుగులేని ఆధిపత్యం మన దేశానికి లభిస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో చైనా దేశంతో ఏవైనా ఘర్షణలు ఏర్పడితే.. ఈ మార్గాన్ని అప్పుడు భారత్ మూసివేస్తే డ్రాగన్ తీవ్రంగా ఆర్థిక కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మార్గం మీదుగానే చైనా దేశానికి ఇతర దేశాలు కీలకమైన ముడి ఇనుము, జనపనార, పెట్రో ఉత్పత్తులు, ఔషధాలు తయారు చేసేందుకు వాడే ముడి సరుకు రవాణా అవుతుంటాయి. వీటి ద్వారా వివిధ రకాల ఉత్పత్తులు తయారుచేసి చైనా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది. చైనా సాధిస్తున్న జీడీపీలో సుమారు 60 శాతం ఈ రంగాల ద్వారానే ఉంటుంది. అందువల్లే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ పై ప్రధానంగా దృష్టి సారించారు. ఇక్కడ విమానాశ్రయం నిర్మించడం ద్వారా పర్యాటకాన్ని ఆకర్షించడంతోపాటు రక్షణ పరంగా కూడా కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుంటుంది. భారత్ ఎప్పుడైతే లక్షద్వీప్ మీద దృష్టి సారించిందో.. అప్పుడే చైనా మాల్దీవులకు దగ్గరయింది. కానీ అప్పటికే మోదీ చేయాల్సింది చేసేసాడు.