సర్కార్ వైఫల్యమైనా ఈగవాలనీయని మీడియా?

మోకాళ్ల లోతు మురికి నీళ్లతో సహవాసం.. ఊపిరి తీసుకోనివ్వని దుర్ఘంధం.. చినుకుపడుతుందంటే భయం.. ఏ కుంట, ఏ చెరువు తెగుతుందో.. ఏ వరద కబలిస్తోందోనని భయం భయం.. ఆరు రోజులుగా హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల జనాల గోస చూస్తే మనసు చివుక్కుమనక మానదు.. తిండి లేదు, మంచి నీళ్లు లేవు.. ఎటూ చూసినా వరద, బురద.. ఇప్పటి వరకు సుమారు 50మంది చనిపోయారు.. కొట్టుకపోయి కొందరు.. గోడ కూలి కొందరు.. ప్రమాదాల్లో మరికొందరు.. విశ్వ నగరంలో జనం […]

Written By: NARESH, Updated On : October 19, 2020 4:20 pm
Follow us on

మోకాళ్ల లోతు మురికి నీళ్లతో సహవాసం.. ఊపిరి తీసుకోనివ్వని దుర్ఘంధం.. చినుకుపడుతుందంటే భయం.. ఏ కుంట, ఏ చెరువు తెగుతుందో.. ఏ వరద కబలిస్తోందోనని భయం భయం.. ఆరు రోజులుగా హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల జనాల గోస చూస్తే మనసు చివుక్కుమనక మానదు.. తిండి లేదు, మంచి నీళ్లు లేవు.. ఎటూ చూసినా వరద, బురద.. ఇప్పటి వరకు సుమారు 50మంది చనిపోయారు.. కొట్టుకపోయి కొందరు.. గోడ కూలి కొందరు.. ప్రమాదాల్లో మరికొందరు.. విశ్వ నగరంలో జనం బాధ తీర్చేదెవరూ? ప్రభుత్వం ఏం చేస్తోంది.. ఇదేనా అభివృద్ది.. ఇదేనా ప్రపంచ స్థాయి నగరమంటే.. అని జనాలు ప్రశ్నిస్తున్నారు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:ఆర్టీసీల పంతాలు.. ప్రైవేట్ బస్సుల దందాలు.. ప్రయాణికులకు కష్టాలు

మంగళవారం కురిసిన వందేళ్ల రికార్డు స్థాయి వర్షంతో మహా నగరం అతలాకుతలమైంది. చిగురుటాకుల వణికిపోతోంది. వరద బాధిత జనాలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. ప్రమాదాలు పెరిగి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నగరం నడిబొడ్డున ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకపోయి చనిపోయాడు. మరో సంఘటనలో ఓ కూలీ ఇంటికి వెళ్తుండగా వరద నీటిలో కరెంట్ పాస్ అయి షాక్ తో అక్కడికక్కడే మరణించాడు. పలు ప్రాంతాల్లో నోరులేని మూగజీవాలు వందల్లో మృత్యువాత పడ్డాయి. అపార్ట్ మెంట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్ ల సెల్లార్లు మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రెండో ఫ్లోర్ లోకి సైతం వరద నీరు చేరుకుంది. ఆదివారం రోడ్ నెం.5లో ఓ సెల్లార్ నీటి గుంత లో పడి నాలుగేళ్ల బాబు మృతిచెందాడు.

ఇలా ఉన్నాయి.. పాలకులు చెప్పే ప్రపంచ మేటి.. భాగ్య నగరంలో జనాల దీనగాథలు.. వందేళ్ల పాటు జనాలు మరిచిపోలేని భయంకర అనుభవాలను వరదలు మిగిల్చాయి అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలైందని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ది బెస్ట్ అని చెప్పిన పాలకులు ఇప్పుడేం చేస్తున్నారని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులపై నిరననలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై ఆదివారం హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డిపై జనాలు తిరుగబడ్డారు. ఆరేండ్ల పాలనలో చేసింది ఇదేనా….. డల్లాస్ ఎటుపాయే.. ఫొటోలకు పోజులు కాదు.. జనాలు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోవాలి అంటూ ఫైర్ అవుతున్నారు.

జనాల బాధలు.. సర్కార్ వైఫల్యాలు ఇలా ఉంటే.. మన మీడియా సంస్థలు ఇవేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ధైర్యం చాలనట్టుగా ఉన్నాయి. ఇది ఎవరి పాపం.. గతంలో పాలించిన ప్రభుత్వాల నిర్లక్ష్యం అంటూ కొన్ని చానెళ్లు స్టోరీలు వండివారుస్తున్నాయి. ఏడేళ్లుగా అధికారంలో ఉన్నా పార్టీని ప్రశ్నించడానికి ధైర్యం లేకనో, అధికార పార్టీతో లేనిపోని గొడవ ఎందుకనో మీడియా సంస్థలన్నీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. మరికొన్ని మాత్రం ఈ దారుణ వైఫల్యాన్ని జీహెచ్ఎంసీ పై, ఆఫీసర్లపై వేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ నుంచి ప్రజలను డైవర్ట్ చేస్తూ స్టోరీలు వల్లెవేస్తున్నాయి.

Also Read: జగన్‌ లేఖతో మోడీ-షాలకు తలనొప్పులు?

ప్రభుత్వం మంచి పని చేస్తే వంద శాతం మెచ్చుకోవాలి.. ఏదైనా తప్పు చేస్తే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అలాగే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అంతే కాని ఇంతటి కష్టకాలంలో మిన్నకుండిపోవడం ఎంత వరకు సమంజసమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇప్పుడైనా మరింత పటిష్ట చర్యలు తీసుకుని అభాగ్యులను ఆదుకోవాల్సిన అవసరముందని ప్రజలు కోరారు. భవిష్యత్ లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా.. మౌలిక వసతుల విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని కోరుతున్నారు.