ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిసారి అదో ఇదో చెప్పి జనసేనను పడుకోబెడుతున్న బీజేపీ తీరుపై పవన్ లో అసహనం బయటపడింది. జనసేనాని ముందుగా తెలంగాణ బీజేపీకి షాకిచ్చాడు. తర్వాత ఏపీ బీజేపీ ఇలానే వ్యవహరిస్తే కటీఫ్ చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాజకీయాలను షేక్ చేసేలా పవన్ తీసుకున్న ఈ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ పవన్ ను అవమానించింది. పోటీ నుంచి వైదొలిగినా నేతలు అవమానంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి తెలంగాణ బీజేపీతో పవన్ కటీఫ్ చేసుకున్నాడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన జనసేన ఆవిర్బావ వేడుకల్లో భాగంగా మాట్లాడిన పవన్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పవన్ సంచలన ప్రకటన చేశాడు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి షాకిచ్చాడు. ‘బీజేపీ కేంద్ర నాయకత్వం జనసేనతో ఉన్నా తెలంగాణ బీజేపీ మా పార్టీని అవమానించింది. జనసేనను చులకన చేసేలా తెలంగాణ బీజేపీ మాట్లాడింది. అందుకే తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థి అయిన పీవీ కుమార్తె వాణికి మద్దతిస్తున్నాం. పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహానుభావుడు’ అని పవన్ స్పష్టం చేశారు. ఈ ప్రకటన బీజేపీలో దుమారం రేపింది. బీజేపీతో పవన్ కటీఫ్ దిశగా పయనిస్తున్నాడా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
బీజేపీపై ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయంతో తిరుగుబావుటా ఎగరవేసినట్టే కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీకి షాకిచ్చిన పవన్ ఏపీ బీజేపీకి అదే ట్రీట్ మెంట్ ఇస్తాడని తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో వెనక్కిలాగడం.. తిరుపతి సీటులో కాంప్రమైజ్ చేయడంతో ఇప్పటికే జనసైనికులు రగిలిపోతున్నారు. తాజాగా ఆ నిర్ణయాలపై ఉడికిపోతున్న జనసేనాని పవన్ సైతం బీజేపీకి దూరంగా జరుగుతున్నట్టు పరిణామాలను బట్టి తెలుస్తోంది.