ఎన్నికల వేళ.. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇంటిబాట.. కారణమిదే?

వివాదాస్పద ఐఏఎస్ అధికారి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. మరోసారి వార్తల్లో నిలిచారు. పట్టుపట్టి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్… తాను తీసుకునే ప్రతీ నిర్ణయంలో ఏకపక్ష ధోరణి అవలంబిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు అంటున్నారు. ఐఏఎస్ అధికారుల నుంచి తన శాఖలో పనిచేసే సిబ్బంది వరకు అందరిపై కఠిన నిర్ణయాలు తీసుకుని.. ఎన్నికల వేళ బదిలీల పరంపర కొనసాగిస్తున్నారు. ఇక జగన్ సర్కార్ పై.. వైసీపీ ముఖ్య […]

Written By: NARESH, Updated On : February 1, 2021 10:44 am
Follow us on

వివాదాస్పద ఐఏఎస్ అధికారి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. మరోసారి వార్తల్లో నిలిచారు. పట్టుపట్టి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్… తాను తీసుకునే ప్రతీ నిర్ణయంలో ఏకపక్ష ధోరణి అవలంబిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు అంటున్నారు. ఐఏఎస్ అధికారుల నుంచి తన శాఖలో పనిచేసే సిబ్బంది వరకు అందరిపై కఠిన నిర్ణయాలు తీసుకుని.. ఎన్నికల వేళ బదిలీల పరంపర కొనసాగిస్తున్నారు.

ఇక జగన్ సర్కార్ పై.. వైసీపీ ముఖ్య నేతలతో ఖయ్యం పెట్టుకుని.. గవర్నరుకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. రోజుకో విధమైన లేఖాస్త్రాలు సంధిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రభుత్వాన్ని ఇరుకున పడేయాలని ప్రతి నిమిషమూ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటూ.. సొంత నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రతిపక్ష పచ్చపార్టీ కుట్రలకు ఆజ్యం పోస్తున్నారనే ఆరోపణలు కూడా ఎస్ఈసీపై జోరుగా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చాలాసార్లు ప్రయత్నిస్తున్నారని నిమ్మగడ్డపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

ఎన్నికల సంఘం పేరుతో ప్రత్యేక యాప్ రూపొందించి.. దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం కేంద్రంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఆధ్వర్యంలోనే యాప్ నడుస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సొంతంగా ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు యాప్ లో ఫిర్యాదులను మార్ఫింగ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయని.. వీడియోలను ఎడిటింగ్ చేసి ప్రత్యర్థులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే వీలు కూడా ఉందని పలువురు వైసీపీ నాయకులు అంటున్నారు. అయితే యాప్ వివరాలు ఇంత వరకు వెల్లడించని ఎస్ఈసీ.. టీడీపీ కార్యాలయం కంట్రోల్ రూం నుంచి దీని నిర్వహణకు ఉపక్రమించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పచ్చపార్టీ నేతలు తమ కార్యకర్తల ద్వారా ఫిర్యాదులను యాప్ కు పంపించడం.. దాన్ని మార్ఫింగ్ చేసి.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని.. వైసీపీపై చర్యలు తీసుకునేందుకు రమేశ్ కుమార్ అండ్ టీడీపీ టీం సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇదే సమయంలో నిమ్మగడ్డ తన సొంత గ్రామానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదివారం గుంటూరు జిల్లా.. దుగ్గిరాలలోని తన స్వగృహానికి వెళ్లారు. దుగ్గిరాలలో నిమ్మగడ్డకు ఓటు విషయంలో చర్చ జరుగుతున్న క్రమంలో సొంతూరు పర్యటన హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే నిమ్మగడ్డ రాకను పురస్కరించుకుని టీడీపీ నాయకులు ఘన ఏర్పాట్లు చేశారు. రోడ్డు పొడవునా.. ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. ఏడాదిగా సొంతూరుకు వెళ్లని నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుంటూర్ ప్లాన్ చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దుగ్గిరాల మండలానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులతో నిమ్మగడ్డ తన ఇంట్లోనే గంటన్నరకు పైగా సమావేశం అయినట్లు సమాచారం. అయితే తల్లిని చూసేందుకు వచ్చానని నిమ్మగడ్డ అంటుండగా.. లేదు.. లేదు.. మరో భారీ కుట్రకు తన సొంతూరునే వేదిక చేసుకుంటున్నారని మరికొందరు చెబుతున్నారు.