ఇక బీజేపీ–జనసేన విషయానికొస్తే.. బీజేపీ తరఫున రత్నప్రభ క్యాండిడేట్గా నిలుచున్నారు. ఇక ఆ క్యాండిడేట్ తరఫున ప్రచారం నిర్వహించేందుకు పవన్ వస్తారా లేదా అని చాలా అనుమానాలే ఉండేవి. కానీ.. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇటీవల రంగంలోకి దిగారు పవన్. ఆయన రాకతో అటు బీజేపీకి.. ఇటు జనసేన సైనికుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. తిరుపతి వేదికగా బహిరంగ సభ నిర్వహించి ఓటర్లలోనూ ఉత్తేజాన్ని నింపారు. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకానొక సందర్భంలో ఇక పార్టీ అభ్యర్థికి వచ్చిన ఢోకా ఏమీ లేదనే భావనను తీసుకొచ్చారు.
కానీ.. ఇప్పుడు పవన్ కరోనా నేపథ్యంలో క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ప్రచారం పీక్ స్టేజీలో ఉండగా.. పవన్ ఇప్పుడు క్వారంటైన్ వెళ్లిపోవడంతో ఆ కూటమి అభ్యర్థి పరిస్థితి ఏంటనేది అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు పవన్ కనుక ప్రచారంలోకి రాకుంటే వైసీపీ, టీడీపీలకే లాభం కలిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు సైతం అంటున్నారు. పవన్ మరికొద్ది రోజులు అలాగే ప్రచారంలో పాల్గొంటే ఫాలోయింగ్ పెరగడమే కాదు.. బీజేపీకి మంచి మెజార్టీ కూడా వచ్చేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు పవన్ లేకుండా అది కాస్త బీజేపీకి నష్టాన్ని తెచ్చేలా ఉందా.. అనే ప్రశ్న వినిపిస్తోంది.
ఈ ఎన్నికలో ముఖ్యంగా వైసీపీ తరఫున సీఎం జగన్.. టీడీపీ తరఫున చంద్రబాబు, బీజేపీ–జనసేన కూటమి తరఫున పవన్ కల్యాణ్ స్టార్ క్యాంపెయినర్లనే చెప్పాలి. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్.. ఈసారి ప్రచారంలోకి వస్తారని మొన్నటివరకు అందరూ చెప్పుకొచ్చారు. కానీ.. చివరి నిమిషంలో ఆయన పర్యటన, సభ రద్దయింది. అయితే.. కరోనా నేపథ్యంలోనే జగన్ తన ప్రచారాన్ని క్యాన్సిల్ చేసుకున్నారని టాక్. ఇక చంద్రబాబు కదనరంగంలో ఉన్నా.. నిన్న ఆయనపై జరిగిన రాళ్ల దాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు.. పవన్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు ఎవరిని వరిస్తుంది..? స్టార్ క్యాంపెయినర్లు లేని పార్టీలు ఇప్పుడు ప్రచారాన్ని ఎలా నడిపిస్తాయి..? ఓటర్లు ఏ పార్టీకి ఓట్లు వేయబోతున్నారు..? ఫలితం ఏ పార్టీకి అనుకూలంగా రాబోతోంది..? పోలింగ్ ముగిసి.. ఫలితాలు వచ్చే వరకూ కూడా ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికే పరిస్థితి కనిపించడం లేదు.