ఏపీ ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ మరోసారి తొడగొట్టారు. పంచాయతీ ఎన్నికలు పెట్టి జగన్ సర్కార్ ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న నిమ్మగడ్డ ఇప్పుడు మరో సవాల్ చేశారు. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి తనకు సహకరించే ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో ఎస్ఈసీ ముందుకొచ్చి సంచలన ప్రకటన చేశారు.
ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ అధికారులను హెచ్చరించారు. ఎస్ఈసీ మాటలు విని ఆయన చెప్పినట్టు చేస్తే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని చేసిన ప్రకటన దుమారం రేపింది.దీనిపైనే ఎస్ఈసీ తాజాగా సంచలన ప్రకటన చేశారు.
పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి రాజ్యాంగ రక్షణ ఉంటుందని.. ఎలాంటి అభద్రత అవసరం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భరోసానిచ్చారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఎస్ఈసీ రక్షణ కవచంలో ఉంటారని హామీ ఇచ్చారు. విధుల్లో ఉన్న అధికారులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా ఎస్ఈసీ ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని.. దీనిపై సుప్రీంకోర్టు నుంచి కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు.
అంతేకాదు.. హామీ ఇవ్వడమే కాదు.. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై ముందస్తు అనుమతి లేకుండా చర్యలను నిషేధిస్తూ నిమ్మగడ్డ రమేశ్ ఉత్తర్వులు ఇవ్వడానికి రెడీ అయ్యారు. వ్యక్తులు తాత్కాలికమని.. వ్యవస్థలే శాశ్వతమని మంత్రి పెద్దిరెడ్డికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.