అమెరికా సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్లడం పూర్తికాకుండానే.. దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు తాలిబన్లు. ఈ క్రమంలో ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులు చూసి ప్రపంచం మొత్తం ఆవేదన వ్యక్తం చేసింది. అమెరికాపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. దీనికి స్పందించిన బైడెన్.. అఫ్ఘనిస్తాన్ ను నిలబెట్టడం అమెరికా పని కాదన్నారు. ఆల్ ఖైదాను తుదముట్టించేందుకు మాత్రమే వెళ్లామని, తమ మిషన్ కంప్లీట్ అయ్యిందని, అందుకే తిరిగి వచ్చామని సమాధానం ఇచ్చారు. అయితే.. ఈ సమాధానం చాలా మందికి రుచించలేదు. ఈ నేపథ్యంలో ఓ కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా తాలిబన్లకు షాకిచ్చింది అగ్రరాజ్యం.
తాలిబన్ల ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టే నిర్ణయం తీసుకుంది అమెరికా. ప్రపంచంలోని టాప్ 10 ఉగ్రవాద సంస్థల్లో ఐదో స్థానంలో ఉన్నారు తాలిబన్లు. 2016లో వీరి వార్షిక ఆదాయం రూ.2,900 కోట్లు కాగా.. ఇప్పుడు ఏకంగా 11,829 కోట్లకు పెరిగింది. ఐదేళ్లలోనే వందల రెట్ల ఆదాయం ఎలా పెరిగింది అన్నప్పుడు.. తాలిబన్లు చేస్తున్న ఇల్లీగల్ బిజినెస్సే కారణం.
తాలిబన్ల ప్రధాన ఆదాయ వనరుల్లో మొదటిది డ్రగ్స్ సరఫరా చేయడం. వీరు సరఫరా చేసే డ్రగ్స్ ఓపీఎం సాగు కీలకమైనది. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఓపీఎం వ్యాపారంలో దాదాపు 92 శాతం వాటా అఫ్గనిస్తాన్ నుంచే జరుగుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాలుగా లక్షలాది ఎకరాల్లో సాగు చేస్తూ.. వేల కోట్లు సంపాదిస్తున్నారు.
రెండో అక్రమంగా మైనింగ్ చేయడం. ఇవి రెండు వీరి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. వీటితోపాటు స్థానికంగా జనాల నుంచి పన్నులు వసూలు చేయడం, విదేశాల నుంచి విరాళాలు కూడా అందుకుంటున్నారు. అంతేకాదు.. వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు. తమ అవసరాలు తీర్చుకోవడం మొదలు.. ఆధునిక ఆయుధాలు కొనుగోలు వరకు ఈ డబ్బునే వెచ్చిస్తున్నారు.
అయితే.. ఇప్పుడు అమెరికా ఈ ఆర్థికంపై దెబ్బ తీసింది. పలు సంస్థల పేరుతో అమెరికా బ్యాంకుల్లో దాచిన డబ్బును ఫ్రీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే.. ఆ డబ్బును మళ్లీ వెనక్కి ఇవ్వబోరన్నమాట. ఇలా డబ్బును ఫ్రీజ్ చేయడం వల్ల తాలిబన్లకు వందల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది. ఇది తాలిబన్లకు షాకే అయినప్పటికీ.. మరీ అంత ఇబ్బందికరం కాకపోవచ్చంటున్నారు. ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో.. దేశ ఆదాయం మొత్తం వారి చేతుల్లోనే ఉంటుంది కదా అంటున్నారు.