“ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు” కరోనా రక్కసి విజృంభన తో దేశంలో ఒక్కసారిగా మార్చి 24 నుండి లాక్ డౌన్ విధించడం జరిగింది. దింతో నష్టపోయినవారి జాబితాలో వలస కూలీలు కూడా ఉన్నారు. హఠాత్పరిణామంతో వలస కూలీలు వారి ఉపాధికోల్పోయారు. పని లేక, పరాయి పంచన ఉండలేక, పెట్ట బేడ సర్దుకొని కాలినడకన వారి స్వస్థలాలకు బయల్దేరారు. మార్గం మద్యలో ఉండగా.. మరో వార్తాతో ఉలిక్కి పడ్డారు. “వలస కూలీలను ఆపేసి, ఎక్కడి వారిని అక్కడే నిలిపివేసి షెల్టర్లను ఏర్పాటు చేసి లాక్ డౌన్ పూర్తయ్యే వరకు కదలనివ్వకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ఆ విధంగా వారి కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ ప్రాంతాలలో ఉంటూ కొన్ని సామాజిక సేవలు చేస్తున్నారు. మనసులోని కృతజ్ఞతాభావం వారిని ఊరకే కూర్చోనీయలేదు. అన్నం పెట్టిన గ్రామస్థులను ఆప్తులనుకున్నారు. ఆ గ్రామస్థుల్లో సేవ చేస్తున్నారు. తమ పెద్ద మనసు చాటుకున్నారు వలస కూలీలు. లాక్ డౌన్ లో తమకు తలదాచుకోవడానికి నీడనిచ్చి ఆశ్రయమిచ్చిన పాఠశాలలను వారి గృహాలుగా చూసుకున్నారు.
పాఠశాలను శుభ్రం చేయడమే కాదు చిన్న చిన్న రిపేర్లు చేసి సున్నంతో పాటు రంగులు కూడా వేస్తున్నారు. ”సార్! పాఠశాల గోడలకు సున్నం రాలి, పెచ్చులూడి కనిపిస్తున్నాయి. మాకు పెయింట్ ఇప్పించండి చాలు. రంగులేస్తాం” అన్నారు పెద్దలతో. ప్రతిఫలంగా వారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.
ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. హరియానా, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్ ల నుంచి వచ్చిన 54 మంది కూలీలకు… రాజస్థాన్ లోని సికార్ జిల్లా, పల్సానా పరిధిలోని షాహిద్ సీతారాం కుమ్వాత్, సేథ్ కె.ఎల్.తంబి ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు బస ఏర్పాటు చేశారు. పల్సానా సర్పంచి రూప్సింగ్ షెకావత్ వారికి ఏ లోటూ రాకుండా చూసుకున్నారు.
వలస కార్మికులంతా కలిసి ఆ ప్రాంతంలోని పాఠశాలల ఆవరణలను శుభ్రం చేసి, గోడలకు రంగులు వేసి వాటిని చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఇప్పుడు వారి క్వారంటైన్ కూడా పూర్తయింది. కష్టానికి ప్రతిఫలంగా డబ్బులిచ్చినా… కార్మికులు తీసుకోలేదని, వారి మంచి హృదయానికి తమ ప్రజలు ఎంతో సంబర పడుతున్నారని షెకావత్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లోనూ విశేషంగా ప్రచారంలోకి వచ్చాయి. చిన్న బతుకులు పెద్ద మనసుతో వ్యవహరించారని నెటిజనులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.