Poornakumbham: భారతీయ హిందూ సాంప్రదాయాల్లో పాటించే కొన్నింటిని సాధారణంగా తీసుకుంటాం. కానీ వీటి వెనుక ప్రత్యేక అర్థం దాగి ఉంటుంది. అందులో ముఖ్యంగా దేవాలయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేద సభలు లేదా విశిష్ట అతిథుల రాక సందర్భంగా పూర్ణకుంభ స్వాగతంతో స్వాగతం పలుకుతూ ఉంటారు. ఎంతో ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఈ ఆచారం కేవలం స్వాగత విధానం మాత్రమే కాదు.. అతిథిని దైవస్వరూపంగా భావించి గౌరవించే సంస్కృతికి ప్రతీకగా భావిస్తారు. ఇలా పూర్ణకుంభంతో స్వాగతం పలకడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే?
‘పూర్ణ’ అంటే నిండుదనం, సంపూర్ణత అని అర్థం. ‘కుంభం’ అంటే కలశం లేదా పాత్ర. నీటితో నింపిన కలశంపై మామిడాకులు, కొబ్బరికాయను ఉంచి అలంకరించిన దానినే పూర్ణకుంభం అంటారు. ఇది శుభానికి, ఐశ్వర్యానికి, మంగళకరమైన ఆరంభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వేదకాలం నుంచే పూర్ణకుంభానికి విశిష్ట స్థానం ఉంది. పూర్ణకుంభంలో ఉపయోగించే ప్రతి వస్తువుకీ ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. రాగి లేదా ఇత్తడి పాత్ర విశ్వానికి ప్రతీకగా భావిస్తారు. అందులో నింపే నీరు సృష్టికి, జీవానికి మూలాధారంగా సూచిస్తుంది. కొబ్బరికాయ దైవత్వాన్ని, పవిత్రతను తెలియజేస్తుంది. మామిడాకులు ప్రకృతి, పచ్చదనం, జీవశక్తికి సంకేతాలుగా భావిస్తారు. ఈ సమ్మేళనం మొత్తం కలిసి సంపూర్ణ సృష్టిని సూచిస్తుందని పండితులు వివరిస్తారు.
వేదాలు, ఆగమ శాస్త్రాలు, పురాణాల్లో పూర్ణకుంభానికి విశేష ప్రాధాన్యం ఉంది. యజ్ఞాలు, ప్రతిష్ఠాపనలు, దేవాలయ మహాసంప్రోక్షణలు, వివిధ పూజా కార్యక్రమాల్లో కలశాన్ని దైవ స్వరూపంగా ఆరాధిస్తారు. లక్ష్మీదేవి, గంగాదేవి వంటి దైవశక్తులు కలశంలో నివసిస్తారని హిందూ సంప్రదాయం చెబుతుంది. అందుకే పూర్ణకుంభాన్ని శుభలక్షణంగా భావిస్తారు.
ప్రదాయం ప్రకారం.. ప్రతి ఒక్కరికీ పూర్ణకుంభ స్వాగతం ఇవ్వరు. ముఖ్యంగా పీఠాధిపతులు, జగద్గురువులు, మఠాధిపతులు, యతులు, వేద పండితులు, రాజులు లేదా పాలకులు వంటి విశిష్ట వ్యక్తులకు మాత్రమే ఈ గౌరవం అందించేవారు. వారు సమాజానికి మార్గదర్శకులని భావించి పూర్ణకుంభంతో ఆహ్వానించడం ద్వారా ప్రత్యేక మర్యాదను తెలియజేస్తారు.
దేవాలయాల్లోకి విచ్చేసే ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలు లేదా విశిష్ట అతిథులకు పూర్ణకుంభంతో స్వాగతం పలకడం ఆనవాయితీ. ఇది కేవలం వ్యక్తిని గౌరవించడం మాత్రమే కాదు, ఆయన ద్వారా దైవానుగ్రహం ఆలయానికి, భక్తులకు లభించాలని కోరుకునే భావన కూడా ఇందులో ఉంటుంది. అందుకే పూర్ణకుంభ స్వాగతాన్ని మంగళకరమైన కార్యక్రమంగా భావిస్తారు.
కాలం మారినా పూర్ణకుంభ స్వాగతానికి ఉన్న ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. దేశవ్యాప్తంగా జరిగే ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాల్లో ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. భారతీయ సంస్కృతిలో అతిథిని దేవుడిగా భావించే ‘అతిథి దేవో భవ’అనే భావనకు పూర్ణకుంభ స్వాగతం ఒక అద్భుతమైన ప్రతీకగా నిలిచింది.
