Construction Cost: ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా.. ఈఎంఐ ఎంత ఉండాలో తెలుసా?

హైదరాబాద్‌తో పోల్చుకుంటే దేశంలోని అనేక నగరాల్లో ఈఎంఐలు చాలా తక్కువగా ఉన్నాయి. అహ్మదాబాద్, కోల్‌కతా, పూణె ముందువరుసలో ఉన్నాయి.

Written By: Raj Shekar, Updated On : December 30, 2023 3:08 pm

Construction Cost

Follow us on

Construction Cost: కొత్త ఏడాది ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా..? సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారా? ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నారా? ఈ అద్దె చెల్లించే బదులు ఈఎంఐ కడితే సరికదా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే.. చాలా మంది సామాన్యులు అద్దె కట్టే కన్నా.. సొంత ఇంటిని నిర్మించుకుని ఈఎంఐ చెల్లించడం మేలనుకుంటారు. మరి ఇల్లు కట్టుకునే మధ్య తరగతి వారు ఈఎంఐ ఎంత కట్టాలి ఆలోచిస్తుంటారు. నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ప్రకారం.. ఈఎంఐ ఆదాయంలో 30 శాతం కట్టాల్సి ఉంటుందని పేర్కొంటోంది.

రుణాలపైనే కొత్త ఇల్లు..
ఇల్లు కొనేవారు, కట్టుకునేవారు ఎక్కువశాతం బ్యాంకు రుణాలపైనే ఆధారపడుతుంటారు. తెలంగాణలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఇదే ధోరణి కనబడుతుంది. హైదరాబాద్‌లో చూఏస్తే ఒకప్పుడు తమ ఆదాయంలో 21 శాతం ఈఎంఐ చెల్లిస్తే ఇంటి కొనుగోలు చేసే అవకాశం ఉండేది. అప్పటల్లో ఇళ్ల ధరలు అందుబాటులో ఉండేవి. ఇటీవలి కాలంలో పెరిగిన ధరలు, వడ్డీ రేట్లతో నెలవారీ ఈఎంఐ కూడా పెరిగింది. ఆదాయంలో 30 శాతం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది ఇదే పరిస్థితి ఉండగా 2024లో పెద్దగా మార్పె ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే వడ్డీ రేట్లు కాస్త తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు.

ఆ నగరాల్లో మనకన్నా తక్కువే..
ఇక హైదరాబాద్‌తో పోల్చుకుంటే దేశంలోని అనేక నగరాల్లో ఈఎంఐలు చాలా తక్కువగా ఉన్నాయి. అహ్మదాబాద్, కోల్‌కతా, పూణె ముందువరుసలో ఉన్నాయి. ఆయా నగరాల్లో 2023లో ఇంటి కొనుగోలు స్తోమత మెరుగు పడింది. గృహాలకు చెల్లించే ఆదాయం, ఈఎంఐ నిష్పత్తి ఆధారంగా నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సూచీ తయారు చేసింది..

– అహ్మదాబాద్‌లో ఒక కుటుంబ ఆదాయంలో 21 శాతం ఈఎంఐ చెల్లించి ఇంటిని కొనుగోలు చేయొచ్చు.
– కోల్‌కతా, పూణేలో మాత్రం 24 శాతం ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. చెన్నైలో 25 శాతం ఈఎంఐ కట్టాలి.

– ముంబైలో ఇల్లు అంటే బాగా ఖరీదు. ఇక్కడ వచ్చిన ఆదాయంలో 51 శాతం ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇది 53 శాతానికి పెరిగే అవకాశం ఉంది.

– ముంబై తర్వాత ఖరీదైన మార్కెట్‌గా హైదరాబాద్‌ మారింది. బెంగళూరుతో పోలిస్తే అక్కడి ఆదాయంలో 26 శాతం ఈఎంఐకి కేటాయించాలి. మన హైదరాబాద్‌లో మాత్రం 30 శాతం ఈఎంఐకి కేటాయించాల్సిన పరిస్థితి.

– దేశీయ సగటు 40 శాతంగా ఉంది. ముబయ్‌ మినహా మిగతా నగరాలన్నీ సగటు లోపే ఉన్నాయి. హైదరాబాద్‌లో 2019లో ఆదాయంలో 47 శాతం ఈఎంఐ చెల్లి›్లంచాల్సి వచ్చేది. ఇప్పుడది 30 శాతానికి తగ్గింది. అయినా ఇతర నగరాలతో పోలిస్తే మన ఈఎంఐ ఎక్కువగా ఉంది.

ఎలా లెక్కించారు..
స్థోమత సూచికను లెక్కించేందుకు నగరంలో నిర్మాణంలో ఉన్న ఇంటి సగటు చదరపు అడుగు ధరను పరిగణనలోకి తీసుకున్నారు. రుణ కాలవ్యవధిని 20 ఏళ్లుకు లెక్కించారు. ఇంటి విలువలో 80 శాతం రుణం మంజూరుగా పరిగణనలోకి తీసుకున్నారు. 20 శాతం డౌన్‌ పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా స్థోమత సూచీ రూపొందించారు.

2024లో ఇలా ఉండే అవకాశం..
2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థిరమైన జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణంలో నియంత్రణను అంచనా వేసి ఆర్‌బీఐ రెపోరేటు తగ్గితే బ్యాంకులు కూడా వడ్డీ రేటు తగ్గిస్తాయి. ఫలితంగా ఈఎంఐ కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ బ్యాంకులు వడ్డీ రేటు పెంచితే మాత్రం.. ఈఎంఐలు పెరుగుతాయి.