Yaddanapudi Sulochana : మహిళా రచయితల్లో యుద్ధనపూడి సులోచనారాణిని లెజెండ్గా అభివర్ణించేవారు ఎందరో ఉన్నారు. ఎమెస్కో పబ్లిషర్ విజయ్ కుమార్ ఈమె నవలలను అత్యధికంగా ప్రచురించారు. ఈమె కలం పట్టి నవలను రాస్తే.. ఆ నవలను ఇష్టపడేవారు ఎంతో మంది ఉంటారు. ఆమె కలానికి అభిమానులు ఎందరో.. ఆమె రచనలు, కవితలు, నవలతో ఎంతో మందికి స్ఫూర్తిని నింపి, మంచి స్నేహితురాలిగా, ఇన్ఫ్లూయెన్సర్ గా, మారింది. ఆమె నవలతో కొంత మందిలో మార్పు వచ్చిన మాట వాస్తవం. ఇక ఈ కవయిత్రి కృష్ణా జిల్లాలోని మొవ్వ మండలం కాజా గ్రామంలో 1940లో జన్మించారు. కుటుంబ బంధాలు అద్భుతంగా ఆవిష్కరించే నవలా రచయిత్రిగా నవలా దేశపు రాణిగా కీర్తి పొందింది యుద్ధనపూడి. ఈమె బెస్ట్ నవలలో పాఠకులు ఎక్కువగా ఇష్టపడిన కొన్ని నవలల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
మీనా..
యుద్ధనపూడి సులోచనారాణి నవలలో పాఠకుల నుంచి ఎక్కువ ఆదరణ పొందిన నవలలో మీనా నవల ఒకటి. ఈ నవల రెండు భాగాలుగా ప్రచురితమైంది. అంతే కాదు సీరియల్ రూపంలో కూడా ప్రేక్షకుల ముందు మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఈ నవలను మొదలు పెట్టినప్పుడు పేరులేకుండానే ప్రశ్నార్థకంగా ప్రచురించారు. దీనికి పేరు పెట్టడానికి కథకులకే ఛాన్స్ ఇచ్చారు. అలా వచ్చిన పేరే మీనా. మీనా అనే పేరు ఒక మహిళ పేరుగా మాత్రమే కాకుండా ఒక ప్రముఖ నవలకు పేరుగా మారింది. ఇక సీరియల్ గా మాత్రమే కాకుండా ఈ కథ సినిమాగా కూడా వచ్చింది. విజయనిర్మల స్వీయ దర్శకత్వంలో మీనాగా వచ్చి మంచి మార్కులు వేసుకుంది కూడా. ఇలా ఈ నవల యద్ధనపూడికి మంచి మార్కులు సంపాదించి పెట్టి.. ఆమె కెరీర్ లో ది బెస్ట్ నవలగా మిగిలిపోయింది.
జీవనతరంగాలు..
ఈ పేరు వినగానే చాలా మంది మదిలో తరంగాలు మెదిలాయి అనుకుంటాను. అంతలా ప్రచురితమైనది ఈ నవల. జీవన తరంగాలు తాతినేని రామారావు దర్శకత్వంలో 1973 సంవత్సరంలో విడుదలైన కుటుంబ కథ చిత్రం. ఇందులో శోభన్ బాబు, వాణిశ్రీ ముఖ్యపాత్రలు పోషించారు. దీనికి యుద్దనపూడి సులోచనరాణి రచించిన ఇదే పేరు గల నవల ఆధారం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సురేష్ మూవీస్ పతాకంపై దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు జె.వి. రాఘవులు సంగీత దర్శకత్వం వహించారు. ఘంటసాల ద్వారా వచ్చిన `ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము అనే పాట చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే.
సెక్రటరీ..
సెక్రటరీ గుర్తుందా? సెక్రటరీ.. అదేనండీ చాలా ఫేమస్ నవల. ఈ నవల ఎంతో మందిని ఆకట్టుకుంది కదా.. అదిగో అచ్చం అదే నవల గురించి మనం మాట్లాడుకునేది. తెలుగు సినిమా చరిత్రలో నవలల ఆధారంగా సినిమా తీసి.. ఘన విజయం సాధించిన గొప్ప నవలగా పేరు కూడా పొందింది. యుద్ధనపూడి సులోచనారాణి రచించిన సెక్రటరీ నవల ఆధారంగానే వచ్చింది ఈ సినిమా. మనసులేని బతుకొక నరకం, నా పక్కన చోటున్నది ఒకరికే వంటి పాటలు కూడా చాలా ఫేమస్ అయ్యాయి గురు. ఈ పాటలు ఇప్పటికీ కొంత మంది వింటుంటారు. ఆమె నవలల ఆధారంగా వచ్చిన ఎన్నో సినిమాలు హిట్ గా నిలిచి.. మంచి పేరు సంపాదించాయి.
కీర్తి కిరీటాలు..
ఈ నవల యుద్దనపూడి నవలలో బెస్ట్ నవల. ఇది అత్యద్భుత నవలగా పాఠకుల నుంచి ప్రశంసలు పొందింది. అంతే కాదండోయ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన నవల కూడా. అయితే ఈ కథ గురించి కూడా ఒకసారి అలా అలా తెలుసుకుందాం… కళలైన సంగీతం, నాట్యాలను నేపథ్యంగా వాడుతూ.. వాటికి కుటుంబ కథను జోడించి రచించిన అందమైన సూపర్ నవల. కోటిమందిలో ఏ ఒక్కరికో, ఏ పూర్వ జన్మ పుణ్యం వల్లనో లభ్యమయ్యే అపురూపమైన గాత్రం రాజ్యలక్ష్మికి లభిస్తుంది. ఆమె సంగీత విద్య ఆమెకు కీర్తి కిరీటాలను సంపాదించి పెడుతుంది. అయితే ఇలా తలుపు తట్టిన అదృష్టం అలా కనుమరుగవుతుంది. పెళ్లి తర్వాత జీవితం గందరగోళంగా మారిపోతుంది. రెండు పెళ్లిళ్లు ఆమెపు చెప్పలేని ఒత్తిడికి తీసుకెళుతాయి. మొదటి భర్త వల్ల తేజ పుడుతాడు. కానీ పొరపొచ్చాల వల్ల విడాకులు తీసుకుంటారు. కొడుకును కూడా భర్తకే ఇవ్వాలని కోర్టు తీర్పుఇస్తుంది. తండ్రి పోయి, భర్త లేక ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటొంది.
తోడు కోసం మరో పెళ్లి చేసుకుంటుంది. విదేశీ ప్రయాణం చేసి ప్రవాసంలో గడుపుతుంది. రెండో భర్తకి అప్పటికే ఉన్న కిషోర్ అనే కొడుకును పెంచి పోసిస్తుంది. కానీ కిషోర్ రాజ్యలక్ష్మిని ద్వేషిస్తాడు. కన్నకొడుకు భర్తతో వెళ్లిపోయి. పెంచిన కొడుకు శత్రువులా చూడడంతో కుమిలిపోతుంది. ఇలా ఒక సంగీత కళాకారిణి జీవితంలో అపస్వరాలని ఆర్ధంగా చిత్రించే నవల కీర్తి కిరీటాలు. దీనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి కూడా లభించింది. ఇంత గొప్ప నవలలు రాయడంలో యుద్ధనపూడి ఆరితేరిన రచయిత్రిగా ఒక వెలుగు వెలగడం గొప్ప విశేషం.