Telangana railway line : కేంద్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న తెలుగు రాష్ట్రాల్లో రైల్వే లైన్ల విస్తరణ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. నిదుల కేటాయింపులో వివక్ష చూపుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే కన్నా రోడ్ల విస్తరణపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా అనేక రహదార్లును జాతీయ రహదారులుగా మార్చింది. తాజాగా కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దక్షిణ తెలంగాణ ప్రాంతాల అభివృద్ధికి కీలకమైన వికారాబాద్–కృష్ణా రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక రైల్వే బోర్డుకు చేరింది. రూ.2,750 కోట్ల వ్యయంతో 130.28 కిమీ దూరం విస్తరించిన ఈ మార్గం ఆమోదం పొందితే పరిగి, కొడంగల్, మక్తల్, నారాయణపేటలకు రైలు కనెక్టివిటీ వస్తుంది.
ప్రాజెక్టు వివరాలు..
తొలుత 120 కిమీగా డీపీఆర్ రూపొదించారు. తాజాగా 130.28 కిమీలకు పెంచారు. ఈ లైన్ భూసేకరణ ఖర్చు రాష్ట్రమే భరిస్తుంది. కేంద్రం ఆర్థిక లాభాలపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ, ప్రాంతీయ అభివృద్ధి కోసం ముందుకు వచ్చింది. టేకల్కోడ్ లైమ్స్టోన్ నిక్షేపాలు, సిమెంట్, జౌళి పరిశ్రమలకు ఈ రైల్వేలైన్ దోహదపడుతుంది.
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ..
కొత్త రైల్వే లైన్ నిర్మాణానిక సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక కృషి చేశారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసిన సీఎం ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. ధాన్యం, పత్తి, మిర్చి రవాణా, ఎరువుల సరఫరా, గ్రానైట్ ఎగుమతులకు మార్గం సులభతరమవుతుందని, కొత్త పెట్టుబడులు వస్తాయని తెలిపారు.
కొత్త రైల్వేలైన్తో పరిగి, కొడంగల్, దౌల్తాబాద్, మక్తల్, నారాయణపేటలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఊపందుకుంటాయి. గోవా, హుబ్లీ మార్గాలు దగ్గరవుతాయి. దక్షిణ తెలంగాణ ఆర్థిక దిశను ఇది మలుపు తిప్పుతుందని అంచనా.