Karregutta hills Telangana : తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదాకా మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్నది కర్రె గుట్టలు. విస్తారమైన అడవులతో.. పోలీసులు కూడా అడుగుపెట్టలేని దుర్భేద్యమైన ప్రాంతాలుగా అవి ఉన్నాయి.. ఆపరేషన్ కగార్ లో భాగంగా కేంద్ర బలగాలు ఈ గుట్టలపై గత ఏడాది ఇదే సమయానికి మకాం వేశాయి. మావోయిస్టులను ఏరి పారేశాయి. అత్యంత శక్తివంతమైన ఆయుధాలతో మావోయిస్టులను తుద ముట్టించాయి.
ఆపరేషన్ కగార్ ద్వారా కర్రె గుట్టలపై ఉన్న మావోయిస్టులు కొందరు చనిపోతే.. మిగతా వారు లొంగి పోయారు. అయితే ఈ ప్రాంతంలో విస్తారమైన అడవులు.. ప్రకృతి సిద్ధమైన వనరులు ఉన్నాయి. భవిష్యత్తు కాలంలో ఈ ప్రాంతం వామపక్ష తీవ్రవాదానికి ఆలవాలం కాకూడదని భావించిన తెలంగాణ ప్రభుత్వం.. సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో పోలీస్ అవుట్ బేస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహద్దుల్లో ఉన్న కర్రె గుట్టలు, పామూనురు ప్రాంతాలలో పోలీస్ అవుట్ పోస్ట్ నిర్మించనున్నారు. ములుగు ఎస్పి రామ్నాథ్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని ఇప్పటికే పోలీసులు ఆ దినంలోకి తీసుకున్నారు. ఈ గుట్టల ప్రాంతంలోని జెల్లా, డోలి, తడపల ప్రాంతాలకు రహదారులను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలను కొద్ది రోజుల క్రితం ప్రారంభించారు. గతంలో ఈ ప్రాంతాలకు రోడ్లు ఉండేవి కావు. మావోయిస్టులు ఉండడంతో పోలీసులు కూడా రావడానికి భయపడేవారు. గతంలో ఈ ప్రాంతంలో అనేక ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. నాటి ఘటనలలో పోలీసులు చాలామంది కన్నుమూశారు.
ఆపరేషన్ కగార్ తర్వాత ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది. దీనికి తోడు గిరిజన గ్రామాలలో ఉన్న ప్రజలను పోలీసులు జాగృతం చేశారు. వామపక్ష ఉద్యమాలకు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు వారికి ఉపాధి కల్పించారు. యువకులు, యువతులకు చదువు మీద అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ సోలార్ దీపాలు.. ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. దీంతో ఇక్కడి యువత చదువు బాట పట్టింది. ప్రస్తుతం మా ప్రాంతంలో ఉన్న గిరిజనులు స్వయం ఉపాధి మార్గాలను వెతుక్కుంటున్నారు. కొందరు సోలార్ మోటార్ల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఇక్కడ రోడ్డు పనులు పూర్తయితే.. ములుగు, భూపాలపల్లి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు రాకపోకలకు మార్గం సుగమవుతుంది.
ఇక్కడ పోలీస్ బేస్ క్యాంపు నిర్మిస్తే వామపక్ష ఉద్యమాల ప్రభావాన్ని అణిచి వేయవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. అందువల్లే కేంద్రం సహకారంతో ఇక్కడ బేస్ క్యాంపు నిర్మిస్తోంది. డిజిపి శివధర్ రెడ్డి కొద్దిరోజులుగా ఇక్కడి అధికారులతో మాట్లాడుతున్నారు. పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు. మంగళవారం భూమి పూజ కార్యక్రమం తర్వాత డిజిపి రోడ్డు పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న గిరిజనులతో మమేకం అవుతారు. అనంతరం ఇక్కడ శాంతి భద్రతలు.. ఇతర వ్యవహారాల గురించి స్థానిక పోలీసులను అడిగి తెలుసుకుంటారు.