Pawan Kalyan Shoulder Surgery: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి నేడు ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. గత కొంత కాలం నుండి తన రెండు భుజాలకు సంబంధించిన రొటేటర్ కఫ్స్ నొప్పి తో ఇబ్బంది పడుతున్నారు. వాటికి తగిలిన గాయాల నొప్పి తీవ్రవటం అవ్వడంతో , డాక్టర్లు సర్జరీ అత్యవసరమని రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ కి సూచించారు. అయితే అప్పటికే కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు షెడ్యూల్ చేయబడి ఉండడం తో , వాటిని పూర్తి చేసుకొని వస్తానని డాక్టర్లకు చెప్పారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అవన్నీ పూర్తి అవ్వడం తో నిన్న శుక్రవారం రోజున ఆయన సర్జరీ కోసం ముంబై కి వెళ్లారు.
రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి శనివారం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. శనివారం రోజున నిర్వహించిన ఆపరేషన్ కు మూడున్నర గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది.
పవన్ కళ్యాణ్ కి 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగేవారు.ఈ యాత్రల్లో అభిమానులు దూసుకువచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారితో కరచాలనం చేయాలని ఉత్సాహంతో చేతులు గుంజేవారు. అప్పుడు నొప్పి విపరీతంగా వచ్చినా భరించారు. ఆ తరవాత కూడా ఆ గాయాలను అశ్రద్ధ చేశారు. 2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల్లో.. ముఖ్యంగా మదనపల్లెలో టమోటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కల్యాణ్ గారికి చేరువగా వెళ్ళి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకొనే సందర్భాల్లో గాయాలు తిరగబెట్టాయి. గత సార్వత్రిక ఎన్నికలు, అంతకు ముందు వారాహి యాత్ర సందర్భంలోను అభిమానులు కరచాలనం కోసం దూసుకు వచ్చేవారు.
ఏప్రిల్ మాసంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముక్కుకి శస్త్ర చికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా భరిస్తున్నారు అని వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కొద్ది వారాల కిందట ముంబయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది.
