Smriti Mandhana : ప్రేమించిన వాడు మోసం చేశాడు. మరి కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా అతడి నిజ స్వరూపం బయటపడింది. దీంతో, ఆమె మనసు ఒక్కసారిగా అల్లకల్లోలం అయింది. గుండె పగిలిపోయింది. ఒకరకంగా తీవ్రస్థాయిలో నిర్వేదం ఆమె చుట్టూ ఆవరించింది. ఈ పరిణామం తట్టుకోలేక ఆమె తండ్రికి గుండెపోటు కూడా వచ్చింది.
వాస్తవానికి ఈ పరిస్థితిలో మరొకరు ఉంటే ఎలా ఉండేదో తెలియదు గాని.. స్మృతి మందాన మాత్రం గతం ఒక పీడకల అంటూ పూర్తిగా మర్చిపోయింది. తన పనిలో తాను నిమగ్నం అయిపోయింది. తనకు తాను సర్ది చెప్పుకుంది. ఆ తర్వాత నెట్స్ లో తీవ్రంగా సాధన చేసింది. బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టింది. పరుగులు చేయడంలో నేర్పరితనాన్ని ప్రదర్శించింది. తద్వారా మునుపటి స్మృతి మందాన ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో స్మృతి ఏకంగా 377 పరుగులు చేసింది. తొమ్మిది మ్యాచ్లలో 53.85 సగటు కొనసాగించింది. ఇందులో మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి. ఢిల్లీ జట్టు పై లీగ్ దశలో 96, 38 రన్స్ చేసింది. ఫైనల్ మ్యాచ్లో అయితే 87 పరుగులు చేసి సత్తా చూపించింది.
స్మృతి గతం తాలుకు జ్ఞాపకాలలో జీవించాలి అనుకునే రకం కాదు. ఆమె వాస్తవాన్ని మాత్రమే గ్రహిస్తుంది. వాస్తవంలో మాత్రమే జీవిస్తుంది. భవిష్యత్తు మీద భారీగా అంచనాలు పెట్టుకుంటుంది. అదే స్థాయిలో బలమైన అడుగులు వేస్తుంది. అందువల్ల 2026 సీజన్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టును విజేతగా నిలిపింది. 2024లో బెంగళూరు జట్టుకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ అందించిన స్మృతి.. ఇప్పుడు 2026 లో కూడా మరోసారి టైటిల్ అందించింది.
ఈ సీజన్లో స్మృతి బెంగళూరు జట్టును అన్ని రంగాలలో ముందుండి నడిపించింది. బ్యాటింగ్లో అదరగొట్టింది. బౌలింగ్లో పరిమిత వనరులతోనే సంచలనాలు సృష్టించింది. ఏమాత్రం భయపడకుండా జోరు కొనసాగించింది. 9 మ్యాచ్ లు ఆడితే అందులో ఏడు విజయాలు బెంగళూరు జట్టు నమోదు చేసిందంటే.. స్మృతి ఏ స్థాయిలో బెంగళూరును మార్చేసిందో అర్థం చేసుకోవచ్చు. స్మృతి ట్రోఫీని అందుకున్న తర్వాత భావోద్వేగానికి గురి కాలేదు. కన్నీరు పెట్టలేదు. ఇది నా ఆత్మవిశ్వాసం.. ఇది నా సత్తా అంటూ చూపించింది. స్మృతి అలా ఎందుకు చేసిందో.. ఎవరిని ఉద్దేశించి చేసిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా.
