RK Kotha Paluku : ఇదే ఆశ్చర్యం కాదు.. అతిశయోక్తి అంతకంటే కాదు. కొంతకాలంగా జరుగుతున్న ప్రచారమే. కాకపోతే కొత్త సీసాలో పాత సారా అన్నట్టుగా.. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో రాశారు. దీంతో కొంత చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి.. నాతో చేతులు కలుపు అంటూ వ్యాఖ్యానించారు. ఇది కేవలం సరదా కోసం చేసిన వ్యాఖ్య కాదు. దాని వెనుక బలమైన కారణం ఉంది. బలమైన నేపథ్యం కూడా ఉంది.
ఆదివారం కొత్త పలుకులో నరేంద్ర మోడీ గురించి రాధాకృష్ణ బాగానే రాశారు.. ఇందిరా గాంధీ కంటే రాజకీయాలలో మోడీ మహాబలుడు అంటూ.. జవహర్ లాల్ నెహ్రూ మించిన వాడు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏ లో ఉన్నాడు కాబట్టి రాధాకృష్ణకు తప్పదు. పైగా ఇప్పుడు మోడీ గురించి పాజిటివ్ గానే రాసుకుంటూ పోవాలి.. మోడీ ఏం తప్పులు చేసినా సరే చూసీ చూడకుండా వదిలేయాలి. రాధాకృష్ణకు దీనివల్ల ఏం అవసరం ఉంది.. ఎందుకిలా రాస్తున్నాడనే ప్రశ్నలు సమాధానాలు లేనివి కావు.
దేశ రాజకీయాలను పక్కన పెడితే తెలంగాణ విషయంలో రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి బహిరంగంగానే నరేంద్ర మోడీ ఆఫర్ ఇచ్చారని.. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాలలో.. నాయకులను మోడీ ఆకర్షిస్తున్నారని.. తన పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నారని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ కోవలోని వారేనని.. రేవంత్ రెడ్డి.. భారత రాష్ట్ర సమితిలో హరీష్ రావు ను తమలో చేర్చుకోవడానికి బిజెపి సిద్ధంగా ఉందని రాధాకృష్ణ రాశారు. పైగా ఆ మధ్య హరీష్ రావు బిజెపిలో చేరబోతున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిని ఇన్నాళ్లకు రాధాకృష్ణ అధికారికంగానే ద్రువీకరించారు..
హరీష్ రావు అనేక సందర్భాలలో తాను భారత రాష్ట్ర సమితిలోనే రాజకీయాలు మొదలుపెట్టానని.. తన జీవితం కూడా ఆ పార్టీలోనే ముగిసిపోతుందని చెప్పారు. అయినప్పటికీ రాధాకృష్ణ ఈ వ్యాఖ్యలు చేయడం నిజంగా దాల్ మే కుచ్ కాలా హై అనే సామెతను రుజువు చేస్తోంది.. రేవంత్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. పైగా కాంగ్రెస్ జాతీయస్థాయిలో ఇప్పుడు సత్తా చూపించే అవకాశం లేదు. ఇండియా కూటమి అంత బలంగా లేదు. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి బిజెపిలోకి వెళ్తున్నారా.. హరీష్ రావు కూడా అదే దారిలో నడుస్తున్నారా.. అనే ప్రశ్నలు రాధాకృష్ణ కొత్త పలుకు ద్వారా వ్యక్తమవుతున్నాయి. ప్రతి సభలోను రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. తాను భారత రాష్ట్ర సమితిలోనే ఉంటానని హరీష్ రావు చెబుతున్నారు. అలాంటప్పుడు వీరిద్దరూ బీజేపీలోకి ఎందుకు వెళ్తారు అని ప్రశ్నను అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఇటు గులాబీ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.. కాకపోతే రాజకీయాలలో పరస్పర అవసరాలు మాత్రమే ఉంటాయి. అలాంటప్పుడు ఏదైనా జరగొచ్చు. ఏమైనా కావచ్చు. గతంలో షర్మిల పార్టీ పెడుతుంది అనే విషయాన్ని రాధాకృష్ణనే బయటికి చెప్పారు. కవిత కెసిఆర్ ఫ్యామిలీ నుంచి బయటికి వస్తుంది అని కూడా రాధాకృష్ణనే చెప్పారు. అవి రెండు నిజమయ్యాయి. ఈ ప్రకారం రాధాకృష్ణ రాసినట్టుగా రేవంత్.. హరీష్ రావు బిజెపిలోకి వెళ్లడం ఖాయమేనా.. చూడాలి ఏం జరుగుతుందో..

