Rashmi Gautam: బుల్లితెర నటులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వ్యతిరేకంగా గళం వినిపిస్తుంటారు. ముఖ్యంగా జబర్దస్త్ నటులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అనే ముద్రను మూట కట్టుకున్నారు. మెగా కుటుంబంతో జబర్దస్త్ నటులకు ఉన్న సాన్నిహిత్యం.. పవన్ కళ్యాణ్ తో పాటు కూటమికి వారు అండగా నిలబడడంతో వైసీపీ నేతలు జబర్దస్త్ నటులను తమ ప్రత్యర్థులుగానే చూస్తారు. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే బాహటంగానే జబర్దస్త్ నటులను హెచ్చరిస్తుంటారు. ప్రధానంగా కిరాక్ ఆర్పి, హైపర్ ఆది విషయంలో విరుచుకుపడుతుంటారు. అయితే ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయినట్టు ఉన్నారు యాంకర్ రష్మీ గౌతమ్. ఆమె తాజాగా ఓ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతకు ఇంత అనుభవిస్తారు అంటూ శాపనార్ధాలు పెడుతూ ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
* డీజిల్ కొరతపై ఆందోళనలు..
ఇటీవల రాష్ట్రంలో డీజిల్ కొరత అంటూ పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేసింది. బంకుల డీలర్లకు, చమురు కంపెనీల మధ్య ఏర్పడిన విభాగం డీజిల్ కొరతకు కారణం అయింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమయింది. కానీ ఇంతలోనే అన్ని బంకుల్లో డీజిల్ అందుబాటులోకి వచ్చింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేదు. పైగా పెద్ద నాయకులు ఉన్న ప్రాంతాల్లోనే ఈ నిరసనలు కొనసాగాయి. ఈ క్రమంలో తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నాటు బండిపై ఆటోను పెట్టి.. ఆపై మంది ఎక్కి నిరసన తెలిపారు. దీనిని తీవ్రంగా తప్పుపట్టారు యాంకర్ రష్మి గౌతమ్.
* జంతు ప్రేమికురాలు..
బుల్లితెరలో యాంకర్ గా స్థిరపడిన రష్మి గౌతమ్ జంతు ప్రేమికురాలు కూడా. ఎక్కడైనా జంతువుల హక్కులకు భంగం కలిగితే ఆమె ఇట్టే స్పందిస్తారు. తిరుపతిలో నాటు బండి పై ఆటో ఎక్కించడాన్ని ఆమె తప్పు పట్టారు. ఆ బరువుతో ఆ మూగజీవి ఎంత ఇబ్బంది పడి ఉంటుందో అని ఆవేదన వ్యక్తం చేశారు. కచ్చితంగా ఆ వైసీపీ నేత ఇంతకు ఇంత అనుభవిస్తారు అంటూ వ్యాఖ్యానించారు. వైసిపి నేతల చర్యలను తప్పుపట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.