Pakistan boycott India match : టి20 వరల్డ్ కప్ లో ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబో వేదికగా టీమిండియా తో జరిగే మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం మేరకు తాము ఆ మ్యాచ్ నుంచి తప్పుకున్నామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు వెల్లడించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం ప్రకటించిన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా విస్తృతమైన చర్చ మొదలైంది. అటు సోషల్ మీడియా.. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు వినిపించాయి.
అండర్ 19 వరల్డ్ కప్ లో భారత జట్టుతో పోటీపడిన పాకిస్తాన్.. టి20 వరల్డ్ కప్ విషయానికి వచ్చేసరికి ద్వంద్వ వైఖరిని ప్రదర్శించడం విశేషం. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత యంగ్ ప్లేయర్లు దుమ్మురేపారు. పాకిస్తాన్ జట్టును ఓడించి ఏకంగా సెమీఫైనల్ దాకా వెళ్ళిపోయారు.
సెమి ఫైనల్లో పాకిస్తాన్ ఓడిపోయిన వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం టి20 వరల్డ్ కప్ లో తమ జట్టు ఆడబోదని స్పష్టం చేసింది. దీంతో ఈ వార్త దావనం మాదిరిగా వ్యాపించింది. అంతే కాదు, ఐసీసీ, బిసిసిఐ రాసుకొని తిరుగుతున్నాయని.. అందువల్లే తాము టీ20 వరల్డ్ కప్ లో టీం ఇండియాతో ఆడటం లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వాస్తవానికి ఈ కారణాన్ని ఎవరూ హర్షించలేదు. అంతటి పహల్గామ్ దాడి జరిగిన తర్వాత కూడా భారత్ పాకిస్తాన్ తో ఆసియా కప్ ఆడింది. తటస్థ వేదికలో పోటీ పడింది.
పాక్ భారత జట్టుతో క్రికెట్ మ్యాచ్ ఆడక పోవడం వెనుక అసలు కారణం వేరే ఉందట. ఇదే విషయాన్ని ప్రఖ్యాత స్పోర్ట్స్ జర్నలిస్టు తిరుమల శెట్టి సుమన్ వెల్లడించారు. ఆయన తన సామాజిక మాధ్యమాలలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రకారం బంగ్లాదేశ్ జట్టుకు సంఘీభావం తెలపడానికి పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. బంగ్లాదేశ్ కూడా భారత్ లో ఆడేది లేదని స్పష్టం చేస్తూ.. టి20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. అయితే పాకిస్తాన్ భారత జట్టుతో మ్యాచ్ ఆడబోమని చెబుతూ.. సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది.
బంగ్లాదేశ్ తో ఇటీవల కాలంలో పాకిస్తాన్ దగ్గర సంబంధాలను కొనసాగిస్తోంది. పాకిస్తాన్ దగ్గర యుద్ధ విమానాలను.. ఇతర సామాగ్రిని బంగ్లాదేశ్ కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా పూర్తయినట్టు సమాచారం. ఇటీవల బంగ్లాదేశ్ అధికారులు పాకిస్థాన్లో పర్యటించారు. వారికి యుద్ద విమానాల వాడకం గురించి పాకిస్తాన్ రక్షణ రంగ నిపుణులు శిక్షణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ కు సంఘీభావం తెలపడానికి పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుమన్ వెల్లడించారు.