HomeతెలంగాణKavitha vs KTR : రాఖీ వద్దన్నందుకు.. కేటీఆర్ పైకి కవిత సింగరేణి అస్త్రం!

Kavitha vs KTR : రాఖీ వద్దన్నందుకు.. కేటీఆర్ పైకి కవిత సింగరేణి అస్త్రం!

Kavitha vs KTR సరిగ్గా 20 రోజుల క్రితం భారత రాష్ట్ర సమితికి అనుబంధం గా ఉండే తీబీకే గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవితను తప్పించారు. ఆమె స్థానంలో కొప్పుల ఈశ్వర్ ను నియమించారు. ఈ నిర్ణయం భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ దని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పుకుచ్చారు. కేటీఆర్ కెసిఆర్ పేరు చెప్పినప్పటికీ దాని వెనుక ఉన్నది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొప్పుల ఈశ్వర్ నియామకాన్ని కవిత తప్పు పట్టలేదు. పైగా స్వాగతించారు. వాస్తవానికి కవిత అలాంటి ప్రకటన చేస్తుందని ఎవరూ ఊహించలేదు. కవితను ఎందుకు తొలగించారు.. ఈశ్వర్ ను ఎందుకు ఆ స్థానం నియమించారు అనే ప్రశ్నకు భారత రాష్ట్ర సమితి అధినాయకత్వం వద్ద సమాధానం లేదు.

తనను టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి స్థానం నుంచి తొలగించడం పట్ల కవిత లో లోపల రగిలిపోతున్నప్పటికీ.. బయటికి దానిని కనిపించనియ్యలేదు. అయినప్పటికీ కవిత సైలెంట్ గా ఏమీ ఉండలేదు. సింగరేణి కార్మిక నేతలతో మాట్లాడుతూనే ఉన్నారు. సింగరేణిలో జరుగుతున్న వ్యవహారాల గురించి చర్చిస్తూనే ఉన్నారు.. అనూహ్యంగా ఆదివారం సింగరేణి కార్మికులతో కవిత తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ గురించి.. సింగరేణి కార్మికుల సమస్యల గురించి కవిత మాట్లాడారు. తన సహజమైన ధోరణిలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కార్మికులకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు.. వాస్తవానికి గడచిన 10 సంవత్సరాల కాలంలో సింగరేణి సమస్యలపై కవిత పెద్దగా మాట్లాడలేదు. గౌరవ అధ్యక్షురాలి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆమె ప్రచారం చేశారు. భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆమె గౌరవ అధ్యక్షురాలి స్థానంలో గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఘోరంగా దెబ్బ తిన్నది. ఆ తర్వాత కొంతకాలానికి కవిత మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొన్నారు. అనంతరం అరెస్టయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత రకరకాల రాజకీయ పరిణామాలు ఆమె పొలిటికల్ కెరియర్ ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ప్రస్తుతం కవిత జాగృతి అధినేత్రిగా కొనసాగుతున్నారు. భారత రాష్ట్ర సమితి కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తన సోదరుడితో విభేదాలు ఉన్నాయని చెప్పకనే చెబుతున్నారు.

శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా.. తాను రాఖీ కట్టేందుకు వస్తానని చెబితే కేటీఆర్ వద్దని రిప్లై ఇచ్చారు. ఇది ఒక రకంగా సోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టింది. సహజంగానే ఇది కవితకు డ్యామేజ్ చేసింది. ఎప్పటినుంచో అంతర్గతంగా కోపంతో రగిలిపోతున్న కవిత.. మొత్తానికి ఆదివారం నాడు సింగరేణి సమస్యలను ప్రస్తావించారు. తన నివాసంలో సింగరేణి కార్మిక సంఘం నాయకులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతేకాదు తనకు సింగరేణిలో పట్టు తగ్గిపోయిందని అనుకుంటే అది మీ భ్రమేనని గులాబీ పార్టీ సింగరేణి కార్మిక సంఘానికి సంకేతాలు ఇచ్చారు. వాస్తవానికి కవిత చేసిన హెచ్చరికలు కేటీఆర్ కేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. అయితే దీనిపై కేటీఆర్ ఎలా స్పందిస్తారు చూడాల్సి ఉందని వారు చెబుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version