India Turkey relations: తుర్కియే దీర్ఘకాలంగా భారత్ వ్యతిరేక ధోరణి అవలంబించడం, పాకిస్తాన్కు బలమైన మద్దతు ఇవ్వడం ద్వారా భారత్ను చికాకు పెడుతోంది. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు పక్షపాతం చూపడం, అంతర్జాతీయ వేదికలపై భారత్కు వ్యతిరేకంగా మాట్లాడడం వంటి చర్యలు ఇందులో భాగం. అయినా భారత్ మాత్రం తుర్కియేలో భూకంపం సమయంలో మొదటి స్పందన చూపి సహాయం అందించింది. కానీ ఆ సహాయం కూడా తుర్కియే వైఖరిని మార్చలేకపోయింది.
భారత్ కౌంటర్ వ్యూహం…
ఈ నేపథ్యంలో భారత్ తన వ్యూహాత్మక స్పందనను మొదలుపెట్టింది. తుర్కియేకు ఉత్తరం వైపు ఉన్న ఆర్మేనియా, పశ్చిమం వైపు గ్రీస్, మధ్యధరా సముద్రంలోని సైప్రస్తో సత్సంబంధాలు బలోపేతం చేసుకుంది. ఈ మూడు దేశాలతో డిఫెన్స్ సహకారం పెంచుతూ, బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిస్సైల్స్తో సహా అధునాతన ఆయుధాలు అందించడం ప్రారంభించింది. సైప్రస్కు ఇప్పటికే డెలివరీలు జరిగాయి, గ్రీస్కు కూడా సరఫరా చేయడానికి చర్చలు జరుపుతోంది. భారత సైనికులు ఈ దేశాల్లో వెళ్లి ఆయుధాల వినియోగంపై శిక్షణ కూడా ఇస్తున్నారు. తుర్కియే భారత్పై ఏదైనా ప్రతికూల చర్య తీసుకుంటే ఆర్మేనియా, గ్రీస్, సైప్రస్ దేశాలు భారత్కు మద్దతుగా నిలబడే స్థితి ఏర్పడింది.
అజర్బైజాన్కూ కష్టకాలం..
తుర్కియే అజర్బైజాన్కు ఆయుధాలు సరఫరా చేసి ఆర్మేనియాను ఇబ్బంది పెడుతోంది. అయితే భారత్ అందించే ఆయుధాలు ఈ సమీకరణాన్ని మార్చేస్తున్నాయి. అదే సమయంలో సైప్రస్ను తుర్కియే విభజించి సగం భాగాన్ని ఆక్రమించి, రాజధానిని కూడా విభజించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సైప్రస్కు బ్రహ్మోస్ అందడం తుర్కియేకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది.
తుర్కియే బ్లూ హోమ్ల్యాండ్ సిద్ధాంతం..
తుర్కియే ఇటీవల ‘బ్లూ నేషన్’ లేదా ‘మావీ వతన్’ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది. మధ్యధరా, బ్లాక్ సీ, ఏజియన్ సీలలోని విస్తృత జల ప్రాంతాలు తనవేనని వాదిస్తోంది. దీని వల్ల గ్రీస్, సైప్రస్ జల ప్రాంతాలపై ఆక్రమణ ఉద్దేశాలు స్పష్టమవుతున్నాయి. ఈ సిద్ధాంతం అమలు చేయాలంటే గ్రీస్, సైప్రస్పై ఎక్కువ ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది. దీంతో యుద్ధ పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అలాంటి పరిస్థితిలో గ్రీస్, సైప్రస్ భారత్ అందించిన బ్రహ్మోస్ మిస్సైల్స్ను ఉపయోగించే సామర్థ్యం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
తుర్కియే వైఖరిలో ఆకస్మిక మార్పు…
అయితే ఇటీవల తుర్కియే వైఖరిలో మార్పు కనిపించింది. జూన్ 2న సింగపూర్లో తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ మాట్లాడుతూ, ‘పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నంత మాత్రాన భారత్తో విభేదాలు లేవు. భారత్తో బలమైన సంబంధాలు కావాలని కోరుకుంటున్నాం’ అని ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్కు డ్రోన్లు సరఫరా చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్పు వచ్చింది. అయితే భారత్ వైపు నుంచి స్పష్టమైన సందేశం ఉంది. పాకిస్తాన్ విషయంలో తుర్కియే తన వైఖరి మార్చుకోనంత వరకు భారత్ తన వ్యూహాత్మక ఒత్తిడిని తగ్గించదు. ఆర్మేనియా, గ్రీస్, సైప్రస్తో ఏర్పడుతున్న బలమైన అక్షం తుర్కియేకు, అజర్బైజాన్కు కూడా తీవ్రమైన సవాలుగా మారుతోంది.
