Chandrababu: కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ పై మోదీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈరోజు ఢిల్లీలో ఎన్డీఏ పక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణతో పాటు లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎంపికపై కూడా దృష్టి పెట్టనున్నారు. ప్రధాన ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రజలకు పాలన అందించడంలో కాంగ్రెస్ పార్టీ సరైన సహకారం లేకపోవడంతో ఆ పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కేటాయించేందుకు బిజెపి అంగీకరించలేదు. అందుకే 2019 తరువాత లోక్సభ డిప్యూటీ స్పీకర్ అంటూ ఎవరూ లేకుండా పోయారు. పోస్టు ఖాళీగా ఉంది. అయితే ఆ పోస్ట్ ఇతర పక్షాలకు ఇవ్వకుండా తానే తీసుకోవాలని బిజెపి భావిస్తోంది. అయితే ఆ పదవి ఏపీ నుంచి ఎంపికైన బిజెపి ఎంపీ కి ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ప్రముఖంగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేరు వినిపిస్తోంది.
* సీనియర్ నాయకురాలిగా..
నందమూరి కుటుంబం నుంచి రాజకీయాల్లో రాణిస్తున్నారు పురందేశ్వరి. చంద్రబాబుతో విభేదించి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపిలో పని చేశారు. ప్రస్తుతం బిజెపిలోనే ఉన్నారు. అయితే చంద్రబాబుతో ఉన్న విభేదాలన్నీ సమసిపోయాయి. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు వెనుక పురందేశ్వరి కీలక పాత్ర పోషించారు. పొత్తులో భాగంగా ఆమె రాజమండ్రి నుండి ఎంపీ అయ్యారు. కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆమెకు ఛాన్స్ దక్కలేదు. అందుకే ఇప్పుడు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇస్తారని తెలుస్తోంది.
* గౌరవప్రదమైన విరమణ..
2029 ఎన్నికల నాటికి క్రియాశీలక రాజకీయాలకు దూరం కావాలని భావిస్తున్నారు పురందేశ్వరి. కుమారుడ్ని రాజకీయాల్లోకి తేవాలని భావిస్తున్నారు. అయితే ఇంతలోనే గౌరవప్రదమైన పదవి చేపట్టాలని చూస్తున్నారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే తీసుకోవాలని భావిస్తున్నారు. ఒకవేళ ఏపీకి ఇస్తే మాత్రం చంద్రబాబు సైతం పురందేశ్వరి పేరు సిఫారసు చేసే ఛాన్స్ ఉంది. ఆయన సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం మెండుగా ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో పురందేశ్వరి కేంద్రమంత్రిగా వ్యవహరించారు. ఆ అనుభవంతోనే ఆమెకు బిజెపి అగ్రనాయకత్వం లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
