Telangana Raithu Bharosa : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడంటే?

గత ఎన్నికల సమయంలో రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ హామీ ప్రకటించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసాపై సీరియస్ గా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత యాసంగి పంటకు రైతు బంధు నిధులనే అందించారు

Written By: Srinivas, Updated On : September 19, 2024 10:15 am

Telangana Raithu Bharosa

Follow us on

Telangana Raithu Bharosa : తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’పై ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలో ఈ పథకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైతు భరోసాపై కేబినేట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతుభరోసాపై చర్యలు వేగవంతం చేశారు. ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సాగు లేని భూములకు రైతు భరోసా లేనట్లే నని ప్రకటించారు. దీంతో ఈ పథకంపై వడివడిగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అయితే కేబినేట్ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని రైతులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా రైతు భరోసా రెండు విడతల సాయం చేస్తారా? లేక ఒకే విడత ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

గత ఎన్నికల సమయంలో రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ హామీ ప్రకటించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసాపై సీరియస్ గా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత యాసంగి పంటకు రైతు బంధు నిధులనే అందించారు. రైతు బంధు పథకంలో లోపాలు ఉన్నాయని, అంతేకాకుండా దీనిని కొంత మంది రైతులకే పరిమితం చేయాలని చెప్పారు. ఇందులో భాగంగా ఊరూరా సమావేశాలు నిర్వహించి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు.కొంత మంది రైతులు 5 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని తెలిపినట్లు మంత్రులు తెలిపారు.

ఈ నేపథ్యంలో రైతు భరోసా ను 5 ఎకరాలకు మాత్రమే పరిమితం చేస్తారని అంటున్నారు. మరికొందరు మాత్రం 10 ఎకరల వరకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రైతు భరోసా నిధులను నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలన్నదే మా లక్ష్యమని, అందులో భాగంగానే సమావేశాలు నిర్వహించి కీలక నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే రైతు రుణ మాఫీ విషయంలో బిజీ ఉన్న అధికారులు ఇప్పుడు రైతు భరోసా పంపిణీపై కార్యచరణను ప్రారంభించినట్లు తెలిపారు.

మరో రెండు రోజుల్లో కేబినేట్ మీటింగ్ ఉంటుందని, ఈ సమావేశంలోనే రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే కొన్ని వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. వచ్చే దసరా కానుకగా రైతులకు రైతు భరోసా నిధులను అందించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత వానకాలం పంటకే రైతు భరోసా ఇవ్వాలి. కానీ ఆ సమయంలో రైతు రుణ మాఫీ హడావిడి కారణంతో పాటు నిధుల లేమి కారణంగా రైతు భరోసాను వాయిదే వేశారని కొందరు చెబుతున్నారు. కానీ ఇప్పుడు దసరా కానుకగా రైతు భరోసాను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.

రైతు బంధు కింద ఇప్పటి వరకు ఏడాదికి 10 వేలు అందించారు. రైతు భరోసా ద్వారా రూ.15 వేలు అందిస్తామని కాంగ్రెస్ తెలిపింది. అయితే వానాకాలం, వచ్చే యేసంగి పంటల నిధులు కలిపి ఒకేసారి అందిస్తారా? లేక కేవలం రూ.7,500 అందిస్తారా? అని రైతులు చర్చించుకుంటున్నారు. అయితే ఎలా ఇచ్చినా ఈ పథకం ప్రారంభమైతే రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడే అవకాశం ఉంది.