ఖమ్మంలో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి వ్యాక్సిన్ కోసం ప్రజలు శనివారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇవాళ కొవాగ్జిన్ రెండో డోసు టీకా ఇస్తుండటంతో ప్రజలు బారులు తీరారు. అయితే, నగరం మొత్తంలో 1000 మందికి ఒకే చోట టీకాలు వేసేందుకు అధికారులు అనుమతించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. టీకా కేంద్రం వద్ద సరైన వసతులు లేక గంటల కొద్ది వరుసలో నిల్చొని ప్రజలు నానా అవస్థలు పడ్డారు. టీకా కోసం వచ్చిన వారికి తగిన ఏర్పాట్లు చేయటంలో అధికారులు విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. –