తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారు ఉన్నారు.. అయితే మొన్నటి ఎన్నికల్లో చాలా తక్కువ మంది మాత్రమే పోటీ చేశారు. తమ వారసులను బరిలోకి దించి పక్కకు తప్పుకున్నారు. అటువంటి వారిలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఒకరు. మంత్రిగా, స్పీకర్ గా, పిఎసి చైర్మన్ గా ఇలా సుదీర్ఘ పదవులను చేపట్టారు యనమల రామకృష్ణుడు. చివరిగా ఆయనకు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆసక్తి ఉంది. రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం ఉంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యనమల రామకృష్ణుడుకు ప్రాధాన్యత తగ్గించారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. ఇటువంటి సమయంలోనే చంద్రబాబు యనమలకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు.
* మహానాడు తీర్మానాలు బాధ్యత..
ఈనెల చివరిలో నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మహానాడు జరగనుంది. మూడు రోజులపాటు పండుగ వాతావరణం లో మహానాడు వేడుకలు జరుగుతాయి. జాతీయ అంశాలతో పాటు రాష్ట్రస్థాయి అంశాలను ఈ మహానాడులో చర్చిస్తారు. ప్రతి విషయం మీద తీర్మానాలు పెడతారు. రాజకీయ ఆర్థిక సామాజిక అంశాల మీద ఈ తీర్మానాలు ఉంటాయి. అయితే ఈ తీర్మానాలను తయారు చేసే బాధ్యతను యనమల రామకృష్ణుడు పై పెట్టారు పార్టీ అధినేత చంద్రబాబు. మహానాడు కన్వీనర్ గా ఆయనకు చాన్స్ ఇచ్చారు. దీంతో త్వరలో యనమలకు పెద్ద పదవి రానుందని స్పష్టమవుతోంది. మహానాడు బాధ్యతలు కట్టబెట్టడం ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.
* సుదీర్ఘ నేపథ్యం..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ వచ్చారు యనమల రామకృష్ణుడు. 1983 నుంచి 1999 వరకు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయనకు మంత్రి పదవి దక్కుతూ వచ్చింది. 1994లో మాత్రం ఆయన శాసనసభ స్పీకర్ అయ్యారు. ఆ సమయంలోనే టిడిపి సంక్షోభం ఎదురయింది. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడం వెనుక యనమల రామకృష్ణుడు కృషి ఉంది. అందుకే యనమలకు ప్రాధాన్యమిస్తూ వచ్చారు చంద్రబాబు. 2014లో ఎమ్మెల్సీగా ఉన్న యనమలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2019 నుంచి ఆయన పోటీ చేయడం లేదు. 2024 ఎన్నికల్లో తన వారసురాలిగా కుమార్తెను రంగంలోకి దించి గెలిపించుకున్నారు. రాజ్యసభ పదవి కోసం ఆశావహుడిగా ఉన్నారు. ఇటువంటి సమయంలోనే కీలకమైన మహానాడు బాధ్యతలు ఆయనకు ఇవ్వడం చూస్తుంటే.. ఆయన అనుకున్న పదవి సాధించడం ఖాయమని స్పష్టం అవుతుంది