Bill Gates Meets CM Chandrababu : ఏపీలో( Andhra Pradesh) మైక్రోసాఫ్ట్ ఫౌండర్, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ పర్యటిస్తున్నారు. తన ప్రతినిధి బృందంతో ఈరోజు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. పొగ మంచు కారణంగా విమానం ల్యాండింగ్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొద్దిసేపు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రత్యేక విమానం చక్కర్లు కొట్టింది. సేఫ్ గా ల్యాండ్ అయింది. గన్నవరం విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్ తో పాటు జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి అమరావతి వెళ్లారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో వరుసగా భేటీలు అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.
* కీలక ప్రాజెక్టులపై చర్చ..
ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు తో( AP CM Chandrababu) జరిగిన భేటీలో బిల్ గేట్స్ కీలక ప్రాజెక్టుల గురించి చర్చించారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి చర్చించారు. అమరావతిలోని సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని కూడా బిల్ గేట్స్ పరిశీలించారు. అక్కడ ఆర్టిజిఎస్ విధానాలపై చంద్రబాబు గేట్స్ కు వివరించారు. మరోవైపు బిల్ గేట్స్ వెంట వచ్చిన ప్రతినిధి బృందంతో కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. స్వర్ణాంధ్ర విజన్ 2047, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్యతో సహా ఆయా రంగాల్లో సంస్కరణలను వివరించారు. మరోవైపు బిల్ గేట్స్ తో వచ్చిన ప్రతినిధి బృందం ఉండవల్లి సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో కూడా పర్యటించనుంది. అక్కడ సాగుకు సంబంధించిన విధానాలను ఆ టీం పరిశీలించనుంది. డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టిన సాగు గురించి వివరించనున్నారు.
* నారా లోకేష్ ట్వీట్..
మరోవైపు బిల్ గేట్స్( Bill Gates) పర్యటన నేపథ్యంలో.. మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. ” మిస్టర్ బిల్ గేట్స్.. అమరావతికి స్వాగతం. ఈరోజు గన్నవరం విమానాశ్రయంలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ను నా సంవత్సరం మంత్రులు అనిత, అచ్చెనాయుడు, సత్య కుమార్ తో కలిసి స్వాగతించడం ఆనందంగా ఉంది. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతిక ఆధారిత పాలనలో భాగస్వామ్యులను బలోపేతం చేయడంపై చర్చల కోసం అమరావతికి వెళ్ళాము. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ తో కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదురుచూస్తోంది ” అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
* సంజీవని ప్రాజెక్టుపై..
ప్రధానంగా సంజీవని( Sanjivani) ప్రాజెక్టులో.. బిల్ గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కానుంది. ఈ పథకం ద్వారా గ్రామీణ ఆరోగ్య సేవలు, వ్యాక్సినేషన్, మాతా శిశు సంరక్షణ వంటి అంశాల్లో పురోగతి సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. సంజీవని పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. టెక్నాలజీ ఆధారిత ప్రజా ఆరోగ్య కార్యక్రమం ఇది. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డులు, ముందస్తు రోగనిర్ధారణ, ఉచిత, సులభ వైద్య సేవలు అందించడమే దీని లక్ష్యం. బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో డిజిటల్ హెల్త్ రికార్డులు, పర్సనలైజేడ్ మెడిసిన్ వంటి అంశాలు అమరావతిలో ఫోకస్ చేస్తున్నారు. దీనిపైనే ప్రధానంగా ఈరోజు బిల్ గేట్స్ చర్చించారు. సీఎం చంద్రబాబుతో చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి.