Homeఆంధ్రప్రదేశ్‌AP Budget 2026 : "విశాఖ"కు నిధుల వరద!

AP Budget 2026 : “విశాఖ”కు నిధుల వరద!

AP Budget 2026 : ఏపీ బడ్జెట్లో ( Ap budget ) విశాఖకు అత్యంత ప్రాధాన్యం దక్కింది. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఆర్థిక ప్రాంతానికి సింహభాగం కేటాయింపులు చేశారు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రూ. 3,32,205 కోట్ల రూపాయలతో బడ్జెట్ సభలో పెట్టారు. అన్ని రంగాలకు కేటాయింపులు జరిపారు. మరోవైపు విశాఖ ఆర్థిక ప్రాంతానికి గాను ఏకంగా 28 వేల కోట్ల రూపాయలు కేటాయించడం విశేషం. దాదాపు పది జిల్లాలతో విశాఖ ఆర్థిక కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ముంబాయిని ఆర్థిక రాజధానిగా చూస్తున్న మాదిరిగా.. ఏపీలో ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేయాలని చంద్రబాబు సర్కార్ కృత నిశ్చయంతో ఉంది. కొద్ది రోజుల కిందట విశాఖ ఎకనమిక్ రీజియన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు భారీగా కేటాయింపులు చేయడం ద్వారా ఏ స్థాయిలో ప్రాధాన్యమిస్తున్నారో అర్థం అవుతుంది. 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి లక్ష్యంతో ముందుకు సాగుతోంది చంద్రబాబు సర్కార్.

* ప్రపంచ దిగ్గజ సంస్థలు రాక..
ఇప్పటికే ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖకు( Visakhapatnam) వస్తున్నాయి. పక్కనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటయింది. సువిశాల తీర ప్రాంతంలో పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వస్తున్నాయి. విశాఖ తో పాటు అనుబంధంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు నిలవాలన్నది చంద్రబాబు ప్రణాళిక.. తాజాగా కేటాయించిన నిధులతో పది జిల్లాల్లో ఆర్థిక కార్యకలాపాలను ముమ్మరం చేస్తారు. లక్షలాది ఎకరాలను గుర్తించి పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తారు.

* ప్రణాళిక ఇదే..
ప్రస్తుతం విశాఖ ప్రాంతం 36వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. 15.5 మిలియన్ జనాభా ఉన్న ఈ ప్రాంతంలో 49 బిలియన్ డాలర్ల జిడిపి నమోదవుతోంది. 2032 నాటికి 20 నుంచి 24 లక్షల మేర ఉద్యోగాలు పెంచేందుకు అవకాశం ఉండడంతో.. ఈ ప్రాంతం రాష్ట్ర పురోగతిలో కీలకం కానుంది. సువిశాల తీర ప్రాంతం కావడంతో ఆరు పోర్టులు, 7 మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్లు, 17 మేజర్ వ్యవసాయ క్షేత్రాలు, ఆరు సర్వీస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్తో విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి చేయాలన్నది ప్రణాళిక. అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా తన బడ్జెట్లో 28 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్ కేర్, పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన.. ఇలా ఏడు గ్రోత్ డ్రైవర్లను నిర్ణయించారు.

* అంతా భారీ వ్యూహం..
విశాఖ ఎకనామిక్ రీజియన్ కు( Vishakha economic region ) ఈ స్థాయిలో నిధులు కేటాయించడం వెనుక భారీ వ్యూహం ఉంది. ఈ నిధులను సక్రమంగా ఖర్చు చేసి.. ప్రణాళికలు అమలు చేయగలిగితే వచ్చే ఏడు వేలలో 7.5 లక్షల గృహాలు, పదివేల హోటల్ రూములు, 20 వరకు ఇన్నోవేషన్ సెంటర్లు, పది కాలేజీలు, 7వేల ఆసుపత్రి బెడ్స్, 20వేల హెక్టార్ల పరిధిలో పరిశ్రమలు, 80 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ సముదాయం, 60 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాములు నిర్మించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మొత్తానికి అయితే విశాఖ ప్రాంతానికి బడ్జెట్ నిధుల కేటాయింపు అనేది ఒక గేమ్ చేంజర్ గా నిలవనుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version