Janga Krishna Murthy: వైసీపీకి మరో ఎమ్మెల్సీ ఝలక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ ఆవిర్భావం నుంచి కృష్ణమూర్తి జగన్ వెంట నడుస్తున్నారు. 2014 ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కృష్ణమూర్తి ఓడిపోయారు. 2019లో మాత్రం జగన్ కృష్ణమూర్తిని తప్పించి కాసు మహేష్ రెడ్డిని తెరపైకి తెచ్చారు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన కృష్ణమూర్తికి అన్ని విధాలా న్యాయం చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ కొద్దిరోజుల కిందట ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అయినా కృష్ణమూర్తి సంతృప్తిగా లేరు. గురజాల నుంచి పోటీకి సన్నద్ధమయ్యారు. కానీ జగన్ మాత్రం కాసు మహేష్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. దీంతో జంగా కృష్ణమూర్తి పార్టీని వీడారు. త్వరలో ఆయన టిడిపిలో కానీ, జనసేనలో కానీ చేరతారని ప్రచారం జరుగుతోంది.
జంగా కృష్ణమూర్తి బలమైన బీసీ నాయకుడు. 2009లో ఎమ్మెల్యే అయ్యారు. జగన్ పిలుపుమేరకు వైసీపీలో చేరారు. వైసిపిలో బీసీ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి గెలుపునకు కృషి చేశారు. రాజ్యసభ తో పాటు ఇతర నామినేటెడ్ పదవుల భర్తీ సమయంలో జంగా కృష్ణమూర్తి పేరు బలంగా వినిపించేది. కానీ చివరకు మొండి చేయి చూపేవారు. కొద్ది నెలల కిందటే ఆయన్ను ఎమ్మెల్సీ చేశారు. అయినా సరే గురజాల నియోజకవర్గం పై కృష్ణమూర్తి ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ కాసు మహేష్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. మరోవైపు గురజాల నియోజకవర్గంలో తనను అడుగడుగున అవమానించడంపై కృష్ణమూర్తి రగిలిపోయారు. ఇక టిక్కెట్ దక్కదని తెలుసుకున్నాక వైసీపీలో ఉండడం భావ్యం కాదని ఒక నిర్ణయానికి వచ్చారు.
కొద్ది రోజుల కిందట వైవి సుబ్బారెడ్డి టీటీడీ పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అప్పుడు బలమైన బీసీ నాయకుడుగా ఉన్న జంగా కృష్ణమూర్తికి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. దాదాపు కృష్ణమూర్తి పేరు ఖరారు అయిందని టాక్ నడిచింది. తనకు టీటీడీ పదవి ఇవ్వాలని కృష్ణమూర్తి సైతం సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. కానీ కృష్ణమూర్తి అభ్యర్థనను పట్టించుకోని జగన్.. ఆ పదవిలో కరుణాకర్ రెడ్డి ని నియమించారు. అప్పటినుంచి మరింత కోపంతో రగిలిపోయిన కృష్ణమూర్తికి… ఇటీవల గురజాల నియోజకవర్గం విషయంలోజగన్ క్లారిటీ ఇచ్చారు. కాసు మహేష్ రెడ్డికి లైన్ క్లియర్ చేశారు. దీంతో కృష్ణమూర్తి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయనకు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం ఆహ్వానం ఉంది. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో కానీ, జనసేనలో కానీ చేరతారని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.