జగన్ నెక్ట్స్ టార్గెట్ మాజీ మంత్రి దేవినేని ఉమానే చేశారా..? అందుకే.. ఆయనకు ఈ సీఐడీ నోటీసులు అందాయా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ఉమాకు సీఐడీ నోటీసులు అందించింది. గొల్లపూడిలోని తన నివాసంలో ఈ నోటీసులు అందించారు సీఐడీ ఆఫీసర్లు. గురువారం కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
దీంతో జగన్ ఉమాను టార్గెట్ చేశారని విమర్శలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల దేవినేని ఉమా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మార్ఫింగ్ చేసిన జగన్ వీడియోలు ప్రదర్శించారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో 464,465,468,471,505 సెక్షన్ల కింద సీఐడీ అధికారులు ఉమాపై కేసు నమోదు చేశారు. ఓ న్యాయవాది ఫిర్యాదు చేయగా.. ఈ మేరకు కేసు నమోదైంది. విచారణకు హాజరయ్యేందుకు వచ్చేటప్పుడు ఆ వీడియోలను కూడా వెంట తీసుకురావాలని సీఐడీ ఆఫీసర్లు ఆదేశించారు.
ఈనెల 1న ప్రెస్మీట్లో ప్రదర్శించిన వీడియోలే కాకుండా.. 7వ తేదీని ఉమా మరో వివాదస్పద వీడియోను ప్రదర్శించి దుమారం రేపారు. అందులో జగన్ మాటలు తిరుపతిని కించపరిచేలా ఉన్నాయి. తిరుపతికి రావడానికి ఎవరైనా గొప్ప వాళ్లు ఇష్టపడరు అంటూ మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. ఈ వీడియోపై వైసీపీ ఫిర్యాదు చేసింది. దీనిపైనా కూడా కేసు నమోదైంది.
అయితే.. తనపై కేసు నమోదు కావడంపై దేవినేని ఉమా కూడా స్పందించారు. ప్రభుత్వం కావాలనే తనను టార్గెట్ చేసిందని.. లేనిపోనివి అంటగడుతున్నారంటూ భగ్గుమన్నారు. ప్రభుత్వ అరాచకాలను, దుర్మార్గ పాలనను ప్రశ్నించే గొంతులపై నాన్బెయిలబుల్ కేసులు పెడుతున్నారని అన్నారు. తిరుపతిపై జగన్ మాటలను బయటపెడితే తనపై కేసు నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. సంబంధం లేని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని అన్నారు.