మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వారి ప్రాణాలకు మాత్రం రక్షణ ఉండడం లేదు. రోజుకు ఎక్కడో ఓ చోట దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కత్తిపోట్లు, పెట్రోల్ పోస్తూ యువతులను బలిపశువులను చేయడంతో బాధిత కుటుంబాల్లో భయాందోళన నెలకొంటోంది. యువతులను బయటకు పంపించాలంటేనే ఎలా అనే అనుమానం అందరిలో కలుగుతోంది. వరుస సంఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన కలుగుతోంది. వీటిపై ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనిషి ప్రాణాలంటే విలువ లేకుండా పోతోందని వాపోతున్నారు. ఈ దారుణాలు ఇలాగే కొనసాగితే వారి భవిష్యత్ ఏమిటనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి.
విజయనగరం జిల్లాకు చెందిన రాంబాబు, ఆ యువతి(Girl) కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. అయితే ఇటీవల ఆ యువతి వేరే యువకుడితో మాట్లాడుతోందని రాంబాబు పెళ్లి రద్దు చేసుకున్నాడు. దీంతో రెండు కుటుంబాల్లో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి రెండు కుటుంబాలను పిలిచి పోలీసులు రాజీ కుదుర్చాలని ప్రయత్నించారు. దీంతో ఆ యువకుడు పెళ్లికి అంగీకరించాడు. కానీ తరువాత అర్థరాత్రి సమయంల ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పక్కనే ఉన్న అక్క, ఆమె కుమారుడికి కూడా మంటలు అంటుకున్నాయి.
దీంతో ముగ్గురు గాయపడ్డారు. వీరిని విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చౌడువాక బాధితురాలిని కలెక్టర్ సూర్యకుమారి, ఎస్పీ దీపికా పాటిల్ పరామర్శించారు. హత్యాయత్నం చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లో చార్జీ షీట్ దాఖలు చేస్తామన్నారు. బాధితురాలికి ఎలాంటి ప్రాణాపాయం లేదని ఎస్పీ తెలిపారు. మహిళల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మరోవైపు మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ బాధితురాలిని పరామర్శించారు.