బీజేపీ వైసీపీ మధ్య వైరం పోయినట్లే. రెండు పార్టీ మధ్య ఇటీవల దూరం పెరిగిందని భావించిన ప్రస్తుతం మంచి సంబంధాలు ఉన్నాయనే తెలుస్తోంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నేత విజయసాయిరెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లు ఇరు పార్టీల్లో రగిలిన రగడకు చెక్ పెట్టే సమయం వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుత సమయంలో విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుల మద్దతు పొందడానికి పార్టీల మద్దతు అవసరం ఏర్పడింది. ఈ కారణంగానే విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత ఇచ్చి పదవి కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కో ఆర్డినేషన్ సెక్షన్ సెక్రెటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ కొద్దిసేపటి కిందటే పార్లమెంటరీ బులెటిన్ విడుదల చేశారు. విజయసాయిరెడ్డితో పాటు బీజేపీకి చెందిన డాక్టర్ సుధాంశు త్రివేదిని కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యుడిగా తీసుకున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఇద్దరు సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థల అకౌంట్లను తనిఖీ చేసే అధికారం ఉంటుంది. లోక్ సభలో ప్రతిపక్ష నేత ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి పీఏసీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. లోక్ సభ, రాజ్యసభల నుంచి ఎంపిక చేసిన వారిని ఈ కమిటీలోకి సభ్యులుగా తీసుకోవడం ఆనవాయితీ. రాజ్యసభ వరకు ఖాళీగా ఉన్న రెండు స్థానాలను విజయసాయిరెడ్డి, సుధాంశు త్రివేదితో భర్తీ చేసినట్లు తెలుస్తోంది
విజయసాయిరెడ్డికి పదవి ఇవ్వడంతో బీజేపీ వైసీపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలుస్తోంది. ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న తరుణంలో విజయసాయిరెడ్డికి పదవి కట్టబెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా చోటుచేసుకుంటున్నపరిణామాలతో వైసీపీకి కూడా బీజేపీ సముచిత స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది.