
తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వేడి పెంచుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు నియోజకవర్గంలో మకాం వేశారు. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ ఉపపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా మరోసారి నాగార్జున సాగర్ సీటును కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఈ ఉప ఎన్నికల నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి నోముల కుమారుడు భాగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో ఉన్నారు. తాగాజా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ అభ్యర్థి నామినేషన్ వేయడం ఆసక్తి రేపుతోంది.
ఇప్పటివరకు నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు 13 నామినేషన్లు దాఖలు అయ్యాయి. గురువారం ఆరుగురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 12మంది ఇండిపెండెట్లు.. ఒకరు వైఎస్సార్ సీపీ పార్టీ నుంచి నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న వైసీపీ అబిమానలు సైతం అనధికారికంగా టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇరు తెలుగు రాష్ర్టాల మధ్య స్నేహ సంబంధం కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ సహా తెలంగాణలో జరిగిన పలు ఎన్నికల్లో వైసీపీ టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు వైసీపీ నుంచి సాగర్ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది.
ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. సాగర్ ఉప ఎన్నిక బరిలో తెలంగాణ అమరవీరుల కుటుంబసభ్యులు 400 మంది నామినేషన్లు వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమి హామీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పసుపు రైతులు ఇలానే చేసి నిజామాబాద్ ఎంపీగా కవితను ఓడించారు. దీంతో సాగర్ ఉప ఎన్నికలో గెలుపుపై టీఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది.
సాగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటిరోజు ఐదుగురు నామినేషన్లు వేశారు. ఈ నెల 30 నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ. ఈ నెల 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 3వరకు ఉపసంహరణ, ఏప్రిల్ 17న పోలింగ్, మే 2న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. పోలింగ్ సమయం ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది.