Prashant Kishor: ఏ రంగంలోనైనా క్రెడిబిలిటీ ( credibility) ముఖ్యం. అది కోల్పోతే మాత్రం ఎవరు నమ్మరు. నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలానే ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ పూర్తిగా జీరో అయింది. ఆ పార్టీతో కలిసి వచ్చేవారు కూడా కరువవుతున్నారు. చివరకు సలహాలు ఇచ్చేందుకు కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి. అయితే ఇప్పుడు ఒకప్పటి తన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించినట్లు తెలుస్తోంది. వందల కోట్ల రూపాయలు ఆఫర్ పెట్టినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం, బలహీనత తెలిసిన వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ అయితే గట్టెక్కించగలరు అనేది ఆ పార్టీ నమ్మకం. అయితే వరుసగా ఇటీవల ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలలో ఇకముందు జగన్మోహన్ రెడ్డికి పనిచేసేది లేదని తేల్చి చెప్పారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంది.
* మంచి ట్రాక్ రికార్డ్..
ప్రశాంత్ కిషోర్ కు( Prashant Kishore ) మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆయన వ్యూహాలతో ఎన్నో రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ముఖ్యంగా 2019లో జగన్మోహన్ రెడ్డి అద్భుత విజయం వెనుక పీకే వ్యూహాలు పనిచేశాయి అనేది బహిరంగ రహస్యం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రశాంత్ కిషోర్ ను పట్టించుకోవడం మానేశారు జగన్మోహన్ రెడ్డి.. వారిద్దరి మధ్య తీవ్ర మనస్పర్ధలు కూడా వచ్చాయి. అందుకే ప్రశాంత్ కిషోర్ మొన్నటి ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా వ్యాఖ్యానాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ఓడిపోతారని జోష్యం చెప్పారు. మనస్పర్ధలు కారణంగానే ఆయన చంద్రబాబుతో నేరుగా భేటీ అయ్యారు. కూటమికి అనుకూలంగా కొన్ని రకాల సంకేతాలు పంపారు. అయితే తాజాగా తమిళనాడులో విజయ్ విజయం వెనుక పీకే సలహాలు సూచనలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు పీకే కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
* పార్టీ ఫండింగ్ కోసం..
ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రం బీహార్లో జన్ సూరజ్ ( Jan Suraj )పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే అక్కడ విజయం అందుకునే క్రమంలో చతికిల పడ్డారు. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. తన వ్యూహాలతో ఎంతోమందికి విజయం అందించిన ఆయన మాత్రం.. స్వీయ విజయాన్ని పొందలేకపోయారు. అయితే తన ప్రాంతీయ పార్టీని కాపాడుకునేందుకుగాను ఆయనకు ఇప్పుడు డబ్బులు అవసరం. ఎట్టి పరిస్థితుల్లో జన్ సూరజ్ కొనసాగుతుందని.. ఆస్తులు అమ్ముకొని అయినా పార్టీని నడిపిస్తానని ప్రశాంత్ కిషోర్ ప్రకటన చేశారు. అయితే ఈ ఒక్క కారణాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. భారీ మొత్తంలో ప్రశాంత్ కిషోర్ కు ఆఫర్ చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. అయితే రాజకీయాల్లో విలువలు విశ్వసనీయతలకు కొంత పెద్దపీట వేయాల్సి ఉంటుంది. ఎన్నో రాజకీయ పక్షాలకు విజయాలు అందించిన ప్రశాంత్ కిషోర్ కు ఇది తెలియంది కాదు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అదే పనిగా ప్రయత్నాలు చేస్తోంది ప్రశాంత్ కిషోర్ కు. మరి ఆయన ఎలా వ్యవహరిస్తారో చూడాలి..