Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో దారుణం..

సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్‌కు రాగా.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు. ఈ విషయం గురించి సిబ్బందిని అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.

Written By: NARESH, Updated On : June 5, 2023 11:28 am
Follow us on

Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ.. మొదటి నుంచి విద్యార్థులపై వివక్షకు కేంద్రంగా మారింది. ఇక్కడ సౌకర్యాల కొరత.. అస్తవ్యవస్థ పాలనతో భ్రష్టుపట్టిపోయింది. ఇప్పటికే సౌకర్యాల లేమీతో విద్యార్థులు కొద్దిరోజులు ఆందోళన చేశారు. గవర్నర్ తమిళి సైతం ఇక్కడికి వచ్చి వారికి సంఘీభావం తెలిపి తెలంగాణ సీఎం కేసీఆర్ ను తూర్పారపట్టారు. ఇక విద్యార్థుల ఆందోళన.. అస్వస్థతకు గురికావడంతో దెబ్బకు ప్రభుత్వం దిగివచ్చింది. మంత్రి కేటీఆర్ ఇక్కడకు వచ్చి మరీ ప్రభుత్వం తరుఫున సౌకర్యాల కల్పనకు హామీ ఇచ్చారు.

అయితే మంత్రి కేటీఆర్ పోయిన నెలలు కాకముందే బాసర ట్రిపుల్ ఐటీలో మరో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేసిన సిబ్బంది వారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన వైనం వెలుగుచూసింది.

బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి సిబ్బంది తప్పిదం కావడం గమనార్హం. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్‌కు రాగా.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు. ఈ విషయం గురించి సిబ్బందిని అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. విద్యార్థులు లేని సమయంలో హాస్టల్స్ రూముల తాళాలు పగల గొట్టిన సిబ్బంది.. విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేశారు.

ఈ నెల 7వ తేదీ నుండి విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ఉండటంతో వారు తిరిగొచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు.. పడేసిన సామాన్లు కోసం వెతుక్కోవాలా? లేదా పరీక్షలు రాయాలా? అని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలకు ఏవైనా ఆటంకాలు కలిగితే.. అందుకు బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు, సిబ్బందే బాధ్యత వహించాలని హెచ్చరించారు..