KCR Vs BJP: బిజెపిపై విమర్శ లేదు. మోదీపై ఆగ్రహం లేదు: కెసిఆర్ లో ఏమిటి ఈ మార్పు?

గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ ఏ సభ జరిగినా.. భారతీయ జనతా పార్టీని, ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి.. తొలిసారిగా వారి ఊసు ఎత్తకుండా మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Written By: Bhaskar, Updated On : June 5, 2023 11:26 am

KCR Vs BJP

Follow us on

KCR Vs BJP: కెసిఆర్ తెలుసు కదా.. గతంలో కాంగ్రెస్ మీద, చంద్రబాబు మీద విపరీతంగా విరుచుకుపడేవాడు. తర్వాత బిజెపి తన బిడ్డను ఓడించడంతో వాళ్ళిద్దరినీ పక్కనపెట్టి.. కమలం నాయకులతో పోటీకి దిగాడు. ఢీ అంటే ఢీ అనే రేంజ్ లో విమర్శలు చేశాడు. తన సొంత మీడియాలో అడ్డగోలుగా రాతలు రాయించాడు. ఫ్లెక్సీలు మొదులుకొని సమావేశాలకు గైర్హాజరి వరకు అంది వచ్చిన ఏ అవకాశాన్ని కూడా కేసీఆర్ వదులుకోలేదు. ఇలాంటి కెసిఆర్ నిర్మల్ సభలో మౌనం వహించారు. కాంగ్రెస్ పై ఒంటి కాలు మీద లేచారు.” కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్లీ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదు. రైతుబంధుకు రామ్ రామ్ చెబుతారు. ధరణి తీసేసి అక్రమాలు చేయాలనుకుంటున్నారు. అధికారంలోకి వచ్చి అంతా మింగాలని చూస్తున్నారు.” అని కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

గతానికంటే భిన్నంగా..

గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ ఏ సభ జరిగినా.. భారతీయ జనతా పార్టీని, ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి.. తొలిసారిగా వారి ఊసు ఎత్తకుండా మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆయన టార్గెట్ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. “చాలాకాలంగా వారు అధికారానికి దూరంగా ఉన్నారు. అధికారం ఇస్తే పంటికి అంటకుండా అంతా మింగేయాలని చూస్తున్నారు. 50 సంవత్సరాలు పరిపాలించి కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోయారని, అలాంటివారిని మళ్లీ రానిస్తామా?” అంటూ కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.” రెవెన్యూ శాఖలో గతంలో తీవ్రమైన దోపిడీ జరిగేది. ఎవరి చేతిలో ఎవరి భూమి ఉండేదో తెలిసేది కాదు. నిన్న ఉన్న భూమికి తెల్లారేసరికి పహాణీలు మారిపోయేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ పరిపాలన చూడలేదా? ధరణి తీసేసి మళ్లీ అక్రమాలు చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషన్ 15 నిమిషాల్లో పూర్తవుతుంది. పట్టా కావాలి అంటే పది నిమిషాల్లో జరిగిపోతోంది. ధరణి తీసేస్తే మళ్లీ ఎన్ని రోజులు తిరగాలి? ధరణి తీసివేస్తే రైతుబంధు, రైతు బీమా ఎలా వస్తుంది? వడ్లు కొనుగోలు చేస్తే డబ్బులు రైతుల ఖాతాలో ఎలా వేయగలుగుతాం? “అంటూ కెసిఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బిజెపిపై విమర్శలకు నో..

నిర్మల్ సభలో కెసిఆర్ బిజెపిని పట్టించుకోకపోవడం వెనక రాజకీయ వ్యుహాత్మకత ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొంతమేర స్తబ్దత ఉన్న నేపథ్యంలో జనాలు ఆ పార్టీకి అంత సీన్ లేదని తెలిపేందుకే కెసిఆర్ తెలివిగా ఈ పని చేశారని కొంతమంది అంటున్నారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఎప్పుడైనా అరెస్టు చేస్తారనే సంకేతాలు ఉన్న నేపథ్యంలో, బిజెపితో ఎందుకు గోక్కోవడం అని కెసిఆర్ విమర్శలు చేయలేదని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ నిర్మల్ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటల్లో మునుపటి ధాటి కనిపించలేదు. పైగా ఆయన మాటలు ద్వారా భారతీయ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని ధ్వనించింది. ఇక ఈ సభకు 2001 భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడినప్పటి నుంచి కొన్నాళ్ల క్రితం వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్య నాయకులు నేతల్లో ఒకరి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉమ్మడి ఆదిలాబాద్ పశ్చిమ జిల్లా మాజీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు, భారత రాష్ట్ర సమితి కార్యదర్శి ఈ సత్యనారాయణ గౌడ్ కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆదివారం నిర్మల్ లో కేసీఆర్ బహిరంగ సభ వేదికపై సత్యనారాయణ గౌడ్ మాత్రమే కనిపించారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత శ్రీహరి రావు మాత్రం కనిపించలేదు. ఆయన పార్టీ మారతారని ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, నిర్మల్ సభలో కనిపించకపోవడం అందుకు బలాన్ని చేకూర్చుతోంది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో పెంబి మండలంలోని పలువురు దళిత రైతులు.. తాము 30 సంవత్సరాలుగా పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్నామని, తమకు పట్టాలు ఇవ్వాలని ఫ్లాకార్డులతో నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని సోనాల గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని ఆ గ్రామస్తులు ఫ్లకార్డులు ప్రదర్శించారు.