Wolves Fox : ‘ఉత్తరా’న తోడేళ్లు.. ‘మధ్య’న నక్కలు.. ఏమిటీ జంతువుల ఉపద్రవం

ఉత్తర ప్రదేశ్ లో తోడేళ్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. పసిపిల్లలపై దారుణంగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఈ ఏడుగురు పసిపిల్లలు , ఒక వ్యక్తి కన్నుమూశాడు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.

Written By: NARESH, Updated On : September 10, 2024 9:59 pm

Wolves in Uttar Pradesh. Fox attacks in Madhya Pradesh

Follow us on

Wolves Fox : తోడేళ్ళ దాడుల నుంచి ప్రజలను కాపాడేందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రి యోగి రంగంలోకి దిగారు. అటవీశాఖ అధికారులతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. దానికి “ఆపరేషన్ భేడియా” అనే పేరు పెట్టారు. అది అలా కొనసాగుతుండగానే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో కలకలం నెలకొంది.. ఈ రాష్ట్రంలోని సిహోర్ జిల్లాలో నక్కల బెడద పెరిగిపోయింది. ఇద్దరు వ్యక్తులపై ఒక నక్క దాడి చేసింది. రెహ్తీ అనే ప్రాంతంలో రోడ్డు పక్కన కూర్చున్న ఇద్దరు వ్యక్తులపై ఒక నక్క తీవ్రంగా దాడి చేసింది. దాని బారి నుంచి తప్పించుకునేందుకు వారు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ అది వెంటపడి గాయాలు చేసింది. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ధైర్యం చేసి నక్కను చేతులతో పట్టుకొని దూరంగా విసిరేశాడు. దీంతో అది పారిపోయింది. గాయపడిన ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి..

ఈ దృశ్యాలు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.. అందులో ఉన్న దృశ్యాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ నక్కను పట్టుకుంటామని పేర్కొన్నారు. నక్క దాడి చేసిన నేపథ్యంలో ప్రజలకు అటవీశాఖ అధికారులు కొన్ని సూచనలు చేశారు..” ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. గుంపులుగా ఉండాలి. గ్రామాల్లోకి అటవీ జంతువులు వస్తే బంధించాలి. వాటిని చంపడానికి ప్రయత్నం చేయకూడదని” అటవీ శాఖ అధికారులు సూచించారు. ఇక సల్కాన్పూర్ ప్రాంతంలో ఒక నక్క ఐదుగురిపై దాడి చేసింది. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తోడేళ్లు..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మార్చి నెల నుంచి తోడేళ్లు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ పలువురు చిన్నారులు మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఆ రాష్ట్రంలో ఆరు తోడేళ్ల బృందం సంచరిస్తోంది. ఇప్పటికే కొన్ని తోడేళ్లను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. అయినప్పటికీ మరికొన్ని తోడేళ్లు గ్రామాల మీద పడి దాడులు చేస్తున్నాయి. ప్రజలకు కంటిమీద కునుకును దూరం చేస్తున్నాయి. వాటిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల చిన్నారులు ఆడుకునే బొమ్మల పై వారి మూత్రాన్ని పోసి.. పలు ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. అయితే ఇది సత్ఫలితాలు ఇచ్చిందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ప్రత్యేకమైన డ్రోన్ కెమెరాల ద్వారా తోడేళ్ల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, అడవులు తగ్గిపోవడం.. దాడులు పెరిగిపోవడంతో జంతువులు గ్రామాల మీద పడుతున్నాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. ప్రభుత్వాలు వాటి పరిరక్షణ కోసం చర్యలు తీసుకోనంతకాలం ఇలాంటి దాడులు కొనసాగుతూనే ఉంటాయని వారు వివరిస్తున్నారు. అడవులను పెంచడమే ఇందుకు ఏకైక మార్గమని వారు పేర్కొంటున్నారు.