YS Sharmila: వైయస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయనున్నారా? వారం పది రోజుల్లో ఆ తతంగం పూర్తి కానుందా? ఎటువంటి షరతులు లేకుండా హస్తం పార్టీలో పని చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏకంగా ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం రావడంతో నిజమేనని తేలుతోంది. ఆది నుంచి షర్మిల విషయంలో ఆంధ్రజ్యోతి చెప్పుకొచ్చిన కథనాలు, వార్తలు నిజమయ్యాయి. దీంతో తెలంగాణ వైఎస్సార్ పార్టీ తప్పకుండా కాంగ్రెస్లో విలీనం అవుతుందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత షర్మిళ తన పార్టీని విలీనం చేస్తారని ప్రచారం ప్రారంభమైంది. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరిట షర్మిళ రాజకీయాలు ప్రారంభించారు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. తెలంగాణలో బహు పార్టీల నేపథ్యంలో షర్మిళ పార్టీకి అనుకున్నంత స్థాయిలో హైప్ రాలేదు. దీంతో ఆమె పునరాలోచనలో పడ్డారు. అదే సమయంలో కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ నుంచి విలీన ప్రతిపాదన షర్మిళ కు వచ్చింది. అప్పటినుంచి ఇదో హాట్ టాపిక్ గా మారింది. ఎట్టకేలకు దానికో తుది రూపం వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం రావడంతో వాస్తవమేనని తేలుతోంది.
షర్మిలకు ఆంధ్రజ్యోతితో మంచి సంబంధాలే ఉన్నాయి. ఆమె తెలంగాణలో పార్టీ ప్రారంభిస్తుందని తొలుత చెప్పింది ఆంధ్రజ్యోతే. అటు షర్మిల సైతం ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కే కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. షర్మిల పాదయాత్రకు సైతం ఆంధ్రజ్యోతిలో కవరేజ్ లభించింది. వివేకా హత్య కేసులో సునీతకు షర్మిల సపోర్ట్ గా నిలుస్తున్నారని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. అవన్నీ వాస్తవం అయ్యాయి. ఇప్పుడు షర్మిల పార్టీ కాంగ్రెస్లో తప్పకుండా విలీనం అవుతుందని.. వారం పది రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని ఆంధ్రజ్యోతి వెల్లడించింది. దీంతో తెలుగు ప్రజలకు ఫుల్ క్లారిటీ వచ్చింది.
తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆహ్వానించడంతో షర్మిల సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో ఆమె రాకను టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు. తెలంగాణలో ఆమె ప్రాతినిధ్యం పై ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని షర్మిల చెబుతుండగా.. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఆమెను ఏఐసీసీ కార్యవర్గంలోకి తీసుకోవడంతో పాటు అవసరమైతే స్టార్ క్యాంపెనర్ గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముహూర్తం చూసుకొని పార్టీ విలీన ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఆంధ్రజ్యోతి సైతం ఇదే చెబుతుండడంతో వాస్తవమని తేలుతోంది.