Homeఆంధ్రప్రదేశ్‌Nara Bhuvaneshwari Yatra: భువనేశ్వరి యాత్ర టీడీపీ కి లభిస్తుందా?

Nara Bhuvaneshwari Yatra: భువనేశ్వరి యాత్ర టీడీపీ కి లభిస్తుందా?

Nara Bhuvaneshwari Yatra: నారా భువనేశ్వరి పెద్ద భారమే మోస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. వారికి ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తొలుత తిరుపతి జిల్లాలో యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలు, సమావేశాలు, మహిళలతో ముఖాముఖి కార్యక్రమాలు చేపడుతున్నారు. భువనేశ్వరి యాత్రపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు రాజకీయాల్లో లేకపోవడంతో పెద్దగా పరిణితి కనబరచలేకపోతున్నారన్న మాట వినిపిస్తోంది. అయితే టిడిపి శ్రేణులు ఊహించిన స్థాయిలో ఆమె ప్రసంగాలు ఉండటం మాత్రం ఊరట నిచ్చే అంశం.

అయితే ప్రస్తుతానికైతే పార్టీ శ్రేణుల వరకు ఓకే. కానీ ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే మాత్రం అధికారపక్షం పై విమర్శనాస్త్రాలు సంధించాల్సి ఉంటుంది. మోతాదుకు మించి మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు వ్యక్తం చేయడంలో మాత్రం భువనేశ్వరి అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపడం లేదు. అయితే యాత్ర ప్రారంభించి రెండు రోజులే కావడం, ప్రారంభంలో ఉండడంతో ఆశించిన స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించలేకపోతున్నారని.. మున్ముందు ఆమె పరిణితి సాధిస్తారని టిడిపి శ్రేణులు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆమె పర్యటించనుండడంతో తప్పకుండా లక్ష్యానికి చేరుకుంటారని టిడిపి నేతలు భావిస్తున్నారు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అధినేత జైల్లో ఉన్నారు. దాదాపు 50 రోజులు పాటు రిమాండ్ లో ఉండిపోయారు. ఇటువంటి సమయంలో పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే లోకేష్, బాలకృష్ణ రాజకీయాల్లో ఉన్నారు. పార్టీని కొంతవరకు సమన్వయం చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో భువనేశ్వరి రాజకీయాలపై అవగాహన చేసుకుని.. పార్టీకి వెన్నుదన్నుగా నిలిస్తే తప్పకుండా ప్లస్ అవుతారని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. కానీ ఇంతవరకు ఆమె రాజకీయాలపై ఫోకస్ పెట్టకపోవడం మైనస్ గా మారుతోంది. జగన్కు ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఆయన తల్లి విజయమ్మ అండగా నిలబడ్డారు. అయితే అప్పటికే ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. అసెంబ్లీలో సైతం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ భువనేశ్వరి విషయంలో అలా కాదు. ఆమె ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడింది లేదు. పార్టీలో పెద్దగా పని చేసింది లేదు. ఇప్పుడు ఉన్నపలంగా రాజకీయ ప్రకటనలు చేయడం కొంచెం ఇబ్బందికరమే.

భువనేశ్వరి పెద్దగా మాట్లాడలేరు. సోదరి పురందేశ్వరి మాదిరిగా తెలుగు భాష పై పట్టు లేదు. కేవలం చంద్రబాబు సతీమణిగా, ఆయనకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు మాత్రమే ఆమె చేయగలుగుతున్నారు. అంతకుమించి రాజకీయ ప్రసంగాలేవి చేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె మాటలు టిడిపి శ్రేణులకు కొంత ఆకట్టుకుంటున్నాయి. అంతకుమించి ప్రజల్లోకి ఈ మాటలు వెళితేనే ఆమె అసలైన లక్ష్యాన్ని చేరుకోగలరు. అయితే చంద్రబాబు అరెస్ట్ పుణ్యమా అని పార్టీలో భువనేశ్వరి, నారా బ్రాహ్మణి పాత్ర పెరగడం విశేషం. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా నిజం గెలవాలి సంఘీభావ యాత్ర ఉండడంతో.. భువనేశ్వరి తప్పకుండా సక్సెస్ అవుతారని.. ఎన్నికల్లో పార్టీ అవసరాలకు పనికొస్తారని టిడిపి శ్రేణులు నమ్మకం పెట్టుకున్నాయి. మరి వారి నమ్మకాన్ని భువనేశ్వరి ఎంతవరకు చూరగుంటారో చూడాలి మరి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular